మరికల్: విత్తనశుద్ధితో పంటలకు తెగుళ్ల శాతం తగ్గించవచ్చని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి ఉదయ్శంకర్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో విత్తనశుద్ధి, సురక్షిత పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో, పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం విత్తనశుద్ధి చేయడం రైతులకు ప్రత్యక్షంగా చూపించారు. ఈ విధానంతో నేల ద్వారా పంటలకు సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఓ రహమాన్, ఏఈఓ పరశురాం, రైతులు పాల్గొన్నారు.
అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలి
కొత్తపల్లి: బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. మంగళవారం కొత్తపల్లి, మద్దూరులో బీఎల్ఏలు, పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన హాజరై మాట్టాడారు. బీఎల్వోలు ఐదురోజులుగా ప్రతి ఇల్లూ తిరుగుతూ ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తున్నారని.. క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి అంశాన్ని నమోదు చేయించాలని, ఒక్కరికి ఒకే దగ్గర ఓటు హక్కు ఉండేలా బీఎల్ఏలు దగ్గరుండి చూసుకోవాల ని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, వంచర్ల గోపాల్, పుర కౌన్సిలర్లు దినేష్ కుమార్, నర్సింహులు, అంజయ్య, రాంరెడ్డి, రాజురెడ్డి, గోపాల్ నాయక్, వెంకటేష్, సుల్తాన్, పలు గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎరువులు, విత్తనాలు
అందుబాటులో ఉంచాలి
ఊట్కూర్: వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, ఎరువులు, విత్తనాల నిల్వలను పరిశీలించారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలను విక్రయించాలని తెలిపారు. ఆయన వెంట ఏఓ గణేష్రెడ్డి తదితరులు ఉన్నారు.


