కోస్గి రూరల్: కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కడా చైర్మన్ వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పోతిరెడ్డిపల్లి పాఠశాలలో రూ.కోటితో నిర్మించిన అదనపు తరగతి గదులు, రూ.25 లక్షక్షలతో నిర్మించిన బీసీ, ఎస్సీ కమ్యూనిటి హాల్స్, రూ.30 లక్షలతో నిర్మించిన మన్నూరుకాపు కమ్యూనిటీహల్ను నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో పదోతరగతి వార్షిక ఫలితాల్లో 500పైగా మార్కులు సాధించిన ఏడుగురు విద్యార్థులకు పతకాలు అందజేశారు. అనంతరం బిజ్జారం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభించారు. రూ. 14 లక్షలతో నిర్మించే గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు ఏర్పాటు చేసి కోస్గి బస్డిపో నుంచి రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. నిధుల కొరత లేదని.. గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజలు సైతం సహకరిస్తేనే వేగంగా అభివృద్ధి చేయవచ్చని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, విక్రంరెడ్డి, సర్జఖాన్పేట్ సర్పంచ్ మౌనిక, బిజ్జారం విద్యాసాగర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిప్రసాద్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఎంపీడీఓ శ్రీధర్, నాయకులు అన్నకిష్టప్ప, అంజిలయ్య, ప్రధానోపాధ్యాయుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు.


