నారాయణపేట/ఊట్కూర్: మొహర్రంను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మకుండా పోలీసులకు సహకరించాలని అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్ కోరారు. గురువారం ఆయన డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్తో కలిసి ఊట్కూర్ పోలీస్స్టేషన్లో బందోబస్తు విధులకు హాజరైన 164 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని మూడు సెక్టార్లుగా విభజించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పీర్ల ఊరేగింపు మార్గాల్లో ప్రత్యేక పికెట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, మొబైల్, ఫుట్ పెట్రోలింగ్తో పాటు సోషల్ మీడియాపై కూడా ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రతి అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతంలోనే అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. దొంగతనాలు, మహిళలపై వేధింపులు జరగకుండా ప్రత్యేక బృందాలను మొహరించినట్లు చెప్పారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టే, ఇతరులకు ఇబ్బందులు కలిగించే పోస్టులు, సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాంలాల్, ఆర్ఐ నర్సింహ, ఎస్ఐలు రమేష్, శివశంకర్, రేవతి, గాయత్రి పాల్గొన్నారు.


