నారాయణపేట: సిబ్బంది సంక్షేమానికి తెలంగాణ పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తోందని.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ఎస్పీ డా. వినీత్ తెలిపారు. దివంగత ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కె.బాలనర్సింహులు సతీమణి భారతమ్మకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్న్స్ కింద మంజూరైన రూ.5 లక్షల చెక్కును సోమవారం తన కార్యాలయంలో అందజేసి మాట్లాడారు. ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తారని.. అలాంటి సిబ్బంది కుటుంబాల సంక్షేమాన్ని ప్రభుత్వం, పోలీసుశాఖ అత్యంత బాధ్యతగా భావిస్తోందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో లేదా ఇతర పరిస్థితుల్లో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అందించే బీమా, సంక్షేమ పథకాలు, ఆర్థిక సాయం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బాధిత కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చెక్కు తీసుకున్న భారతమ్మ ప్రభుత్వం, పోలీసుశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ విజయభాస్కర్, డీపీఓ సూపరింటెండెంట్ శ్యాంసుందర్రాజుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


