ఆత్మకూర్/నర్వ: సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా చూసుకోవాలని నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్, మక్తల్ నియోజకవర్గ ఈఆర్ఓ శ్రీను ఆదేశించారు. శుక్రవారం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, ఆత్మకూర్ పురపాలికలోని ఖానాపూర్లో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు. బీఎల్వోలు ఇల్లిల్లూ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణి చేశారా అని అడిగి తెలుసుకున్నారు. పంపిణీ చేసిన ఫారాలను ఎలా నింపుతున్నారని బీఎల్వోలను ప్రశ్నించారు. ఫారాల్లో ఓటర్ల కొత్త ఫొటోలు అతికించి వివరాలను మొబైల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా దగ్గరుండి ఫారాలు పూర్తి చేయాలని కోరారు. వివరాలు తప్పుగా నింపి ఓటు తొలగించేలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి నిరంతరం ఓటర్ల వివరాలను సేకరించి అప్లోడ్ చేయాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఆయన వెంట ఆత్మకూర్ తహసీల్దార్ జేకే మోహన్, సూపర్వైజర్ దండు శ్రీశైలం, బీఎల్వో కవిత తదితరులు ఉన్నారు.


