అన్నదాతకు అవస్థలు
మరికల్: వానాకాలం సీజన్లో సాగు చేసిన వరిపంట ఆశించిన మేర దిగుబడి ఇవ్వకపోవగా.. యాసంగిలోనూ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి ముగుస్తున్నా చలి తీవ్రతత తగ్గకపోవడంతో ఎదుగుదల కనిపించడం లేదు. అలాగే రకరకాల తెగుళ్లు సోకడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలకుపైగా పెట్టుబడులు పెట్టామని.. ఓ పక్క పంట పెరుగుదల లేక ఆందోళన చెందుతుండగా, మరోపక్క తెగుళ్లు సోకి అదనపు భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా పంటకు పురుగు మందుల కొనుగోలుకు రూ.3 వేలు వెచ్చించాల్సి వస్తోందని.. దీనికితోడు పిచికారీ చేయడానికి ట్రాక్టర్ అద్దె రూ.1,500 అవుతుందని చెప్పుకొచ్చారు.
● మండలంలో యాసంగి సీజన్లో కోయిల్సాగర్ ఆయకట్టు కింద 6 వేల ఎకరాలు, వ్యవసాయ బోరుబావుల కింద 2 వేల ఎకరాల వరి సాగు చేశారు. వాతావరణ మార్పులతో అక్కడక్కడ కొన్ని పంటల పెరుగుదల బాగున్నా తెగుళ్లు వీడటం లేదు. మరికొన్ని పంటలైతే చల్లి తీవ్రత కారణంగా ఎదుగుదల లోపించింది. పంట పెరిగేదెప్పుడు, కోతకు వచ్చేదెన్నడోనన్న సందేహంలో రైతులు ఉన్నారు. ఇప్పటికే ఐదుసార్లు ఫర్టిలైజర్, మందులు పిచికారీ చేసినా ఎలాంటి మార్పు కనిపించడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. మరో 45 రోజుల్లో వరి పంటలు కోతకు రావాల్సి ఉందని.. ఇలాంటి పరిస్థితులు ఎన్నడు చూడలేదని చెబుతున్నారు.
వీడని చలి తీవ్రత.. పెరగని వరి పైరులు
తెగుళ్ల బారిన పడిన వైనం
పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం శూన్యం
రూ.1.50 లక్షల పెట్టుబడి..
నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 3 ఎకరాల పంట బాగుంది. మిగతా 3 ఎకరాలు చలి తీవ్రత కారణంగా అక్కడక్కడ పెరగడం లేదు. పంట ఎదుగుదలకు ఐదుసార్లు ఫర్టిలైజర్, పురుగు మందులు పిచికారీ చేసినా లాభం లేదు. ఇప్పటికే రూ.1.50 లక్షల పెట్టుబడి అయింది. కనీసం పెట్టుబడిక కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. – ఎల్లగౌడ్, రైతు, ఎలిగండ్ల
చలి కారణంగానే..
యాసంగిలో చలి ఎక్కువగా ఉండటంతో నారుమడులు కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో కొన్ని రకాల భూముల్లో సాగు చేసిన వరిపంట ఆశించిన మేర పెరగనట్లు కనిపిస్తోంది. వ్యవసాయ అధికారుల సూచనలతో మందులు పిచికారీ చేస్తే కాస్త మార్పు వచ్చే అవకాశం ఉంది.
– రహమాన్, ఏఓ, మరికల్
అన్నదాతకు అవస్థలు


