మాయమాటలునమ్మి మోసపోవద్దు: ఎస్పీ
నారాయణపేట: గొలుసుకట్టు వ్యాపారాలతో ప్రజలను మోసం చేసే వారు పెరుగుతున్నారని, ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు అంటూ ఆశ చూపుతారని, మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం జరుగుతుందని ఎస్పీ డా. వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన పెరగడంతో మల్టీలేవెల్ మార్కెటింగ్పై దృష్టి సారించి వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలే వేదికగా ప్రకటనలిస్తూ అమాయకులను ఆకర్షించి మోసగిస్తున్నారని పేర్కొన్నారు. చాలామంది విదేశాల్లో ఉండి రాకెట్లా నడుపుతారని.. భారీ లాభాలతో పాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట అమాయకులకు వల పన్నుతారని, మాయమాటలు నమ్మవద్దని సూచించారు. అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకె ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దని.. మోసపూరిత ప్రకటనలు, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్క్రైం హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.
పాలమూరు 53వ డివిజన్పై హై‘డ్రామా’
● ఒక్క ఓటుతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్
పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మొత్తం 60డివిజన్లలో కాంగ్రెస్ 29, బీఆర్ఎస్ 15, బీజేపీ 8, ఎంఐఎం ముగ్గురు, స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు. అయితే 53వ డివిజన్ ఫలితాలపై అర్ధరాత్రి వరకు హైడ్రామా సాగింది. మొదటి కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవేందర్కు 816, బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్కు 815 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ రీకౌంటింగ్ కోరడంతో అధికారులు మళ్లీ లెక్కింపు నిర్వహించారు. దీంట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండు ఓట్లు పెరిగి 818కి, బీజేపీ అభ్యర్థికి నాలుగు ఓట్లు పెరగడంతో 819కి చేరింది. దీంతో బీజేపీ అభ్యర్థి ఒక్క ఓటు ఆధిక్యం సాధించాడు. మూడోసారి జరిగిన రీకౌంటింగ్లో కాంగ్రెస్కు 818, బీజేపీ 819 ఓట్లు రావడంతో.. ఒక్క ఓటుతో బీజేపీ అభ్యర్థి రమేష్కుమార్ను గెలుపొందినట్లు కమిషనర్ రామానుంజులరెడ్డి వెల్లడించారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాతనే రమేష్ గెలుపొందినట్లు ప్రకటించారు.
పాక్షిక శనిత్రయోదశి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరస్వామికి శనివారం పాక్షిక శనిత్రయోదశిని పురస్కరించుకొని తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనిగ్రహ దోష నివారణకు భక్తుల చేత భక్తిశ్రద్ధలతో పూజలు చేయించారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ గోపాల్రావు, సర్పంచు సుగుణమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మాయమాటలునమ్మి మోసపోవద్దు: ఎస్పీ


