పరిశీలన బృందాలు
● ‘పది’ విద్యార్థుల అంతర్గత మార్కుల మూల్యాంకనం
● మూడురోజుల్లో పూర్తికి ఆదేశాలు
నారాయణపేట రూరల్: విద్యాశాఖ రూపొందించిన సీసీఈ విధానంలో భాగంగా పదోతరగతి విద్యార్థులకు పాఠశాలలో నిర్వహించే వివిధ కృత్యాలకు సంబంధించి ఉపాధ్యాయులు వేసిన అంతర్గత మార్కుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 2025–2026 విద్యా సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, గురుకులాలకు ఆయా బృందాలు వెళ్లి ఉపాధ్యాయులు వేసిన మార్కులను పరిశీలిస్తున్నారు.
అంశాల వారీగా..
పదోతరగతి విద్యార్థులకు ఈ ఏడాది నిర్వహించిన నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు, ప్రాజెక్టు పని, ఫెయిర్ నోట్స్ ఇతర అంశాలకు సంబంధించి ఒక్కోదానికి ఐదు మార్కుల చొప్పున ప్రతి సబ్జెక్టుకు 20 మార్కులు పాఠశాలలో సంబంధిత ఉపాధ్యాయుడు కేటాయిస్తారు. మిగతా 80 మార్కులకు సంబంధించి వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. ఆరు సబ్జెక్టులకు సంబంధించి 600 మార్కులకుగాను 480 మార్కులకు పరీక్ష రాయగా.. పాఠశాలలో 120 మార్కులు కేటాయిస్తారు.
జిల్లాలో ఇలా..
జిల్లావ్యాప్తంగా 131 ప్రభుత్వ, 44 ప్రైవేట్ పాఠశాలలు, 11 కేజీబీవీలు, 12 గురుకుల పాఠశాలల్లో మొత్తం 8 వేల మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు. వీరి అంతర్గత మార్కుల కోసం మండలాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక జీహెచ్ఎం, ఒక లాంగ్వేజ్ పండిత్, ఒక ఆప్షనల్ ఉపాధ్యాయుడు ఉంటారు. జిల్లావ్యాప్తంగా 32 బృందాలు తనిఖీ చేస్తున్నాయి.
రేపట్నుంచి ఆన్లైన్లో నమోదు..
ఇప్పటికే జిల్లా విద్యాశాఖ మార్కుల కేటాయింపు ప్రక్రియపై ఆదేశాలు జారీ చేసింది. ఆయా పాఠశాలల్లో పరీక్షలు, అసైన్మెంట్, ప్రాజెక్టులు పూర్తి చేయించి మార్కులను రాత పుస్తకాల్లో నమోదు చేశారు. ఆయా బృందాలు మూడురోజుల పాటు కేటాయించిన పాఠశాలలకు వెళ్లి తనిఖీ చేస్తాయి. అనంతరం ఈ నెల 21 నుంచి మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తారు.


