సమర్థవంతంగా ధన్ధాన్య యోజన అమలు
● ప్రధానమంత్రి ధన్ధాన్య యోజనప్రత్యేక అధికారి డా. పొన్నుస్వామి
నారాయణపేట/మరికల్: జిల్లాలో ధన్ధాన్య యోజన మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు శాఖల వారీగా నివేదించాలని ప్రధానమంత్రి ధన్ధాన్య యోజన ప్రత్యేక అధికారి, భారత ప్రభుత్వ ఆయిల్ సీడ్స్ పరిశోధన డైరెక్టర్ డా. పొన్నుస్వామి ఆదేశించారు. గురువారం జిల్లాలోని మరికల్లో పర్యటించిన ఆయన చివరగా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకం అమలు వివరాలను వ్యవసాయ, మత్స్య, పాడి పరిశ్రమ, కో–ఆపరేటివ్, గ్రామీణాభివృద్ధి, ఉద్యాన శాఖల అధికారులు శాఖల వారీగా వివరించారు. సుదీర్ఘంగా చర్చించి అమలుకు అవసరమైన సలహాలు ఇచ్చారు. అంతకుముందు మరికల్ మండలంలోని తీలేరు, ఇబ్రహీంపట్నం, జిన్నారం గ్రా మాల్లో సాగు చేసిన ఆయిల్పాం, మామిడి, దానిమ్మ తదితర తోటలను పరిశీలించారు. జిన్నారంలో రాజవర్ధన్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయిల్పాం సాగు విధానాన్ని వివరించారు. తోటలను అధికారులు పరిశీలించకపోవడంతో కొందరు రైతులు తొలగించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అలాగే అడవి పందులు, కుక్కల బారి నుంచి తోటను కాపాడుకొనేందుకు రాయితీపై కంచె మంజూరు చేయాలని, అలాగే చెట్టుకు రెండు వరుసల స్ప్రింకర్లు, డ్రిప్స్ అందజేస్తే అదనపు భారం తగ్గుతుందని ఆయిల్ఫెడ్ అధికారులకు వివరించారు. పంటల స్థితిగతులు, సాగు పద్ధతులు, ఉత్పాదకత, ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకొని అధికారులతో చర్చించి సూచనలు చేశారు. పథకం అమలుపై జిల్లా అధికారులు, రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి సాయిబాబా, డీఆర్డీఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, కో–ఆపరేటివ్ జిల్లా అధికారి ప్రసాదరావు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఈశ్వర్రెడ్డి, నాబార్డ్ ఏజీఎం షణ్ముఖచారి, ఎల్డీఎం విజయకుమార్, డీపీఓ సుధాకర్రెడ్డి, శాస్త్రవేత్త రాజేంద్రకుమార్, సమితి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


