‘పది’ ఫలితాల్లో జిల్లా ర్యాంకు పెంచాలి
● ఎఫ్ఎల్ఎన్ అమలులో
ఉపాధ్యాయుల పాత్ర కీలకం
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట: ఎఫ్ఎల్ఎన్ అమలులో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ఈసారి పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే మెరుగైన ర్యాంకు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ ముఖ్యమైన కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విద్యా ప్రమాణాల మెరుగు, మౌలిక వసతుల కల్పన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టీస్ పరీక్షల వివరాలు, విద్యార్థుల హాజరుశాతం, ఫలితాల స్థాయి, బలహీనంగా ఉన్న అంశాలు, వాటిని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. వార్షిక పరీక్షల ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మెరిసేలా సమష్టి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పీఎంశ్రీ పథకం నిధుల వినియోగం పాఠశాలల వారీగా తెలుసుకొని అసంపూర్తి పనులు, వాటి గడువు తదితర అంశాలపై సమీక్షించారు. నిధుల వినియోగంలో పారదర్శకత, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ఎఫ్ఎల్ఎస్, ఎఫ్ఎల్ఎన్ సర్వేల అమలుపై చర్చించి ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనస్థాయిని నిరంతరం గమనిస్తూ అవసరమైన అకాడమిక్ ఇంటర్వెన్షన్లు చేపట్టాలని సూచించారు. ఉపాధ్యాయుల సన్నద్ధతే ఎఫ్ఎల్ఎన్ విజయానికి ప్రధాన బలమని పేర్కొన్నారు. చదువుల పండుగ కార్యక్రమంలో భాగంగా అమలవుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిని పరిశీలిస్తూ వంద రోజుల పఠనోత్సవం ద్వారా విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, భాషాపరమైన నైపుణ్యాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ఆయా కార్యక్రమాలు నిర్దేశిత విధంగా అమలు కావాలని సూచించారు. అలాగే కేజీబీవీలు, పాఠశాలల్లో టాయిలెట్లు, తాగునీటి సదుపాయా లు, తరగతి గదులు, ఇతర సివిల్ వర్క్స్ పనుల పురోగతిని సమీక్షిస్తూ విద్యార్థులకు అనుకూలమైన, శుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సమీక్షలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్, సెక్టోరల్ అధికారులు రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి, సంగీత, శ్రీనివాస్, మధ్యాహ్న భోజన పథకం కో–ఆర్డినేటర్ యాదయ్య పాల్గొన్నారు.


