ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష
నారాయణపేట రూరల్: జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకుగాను జిల్లావ్యాప్తంగా 5,980 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన పరీక్షకు 5,777 మంది విద్యార్థులు హాజరుకాగా.. 203 మంది గైర్హాజరయ్యారు. 96.6 శాతం హాజరు నమోదైంది. 5వ తరగతి ప్రవేశానికి మరికల్, కొండాపూర్, నారాయణపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,166 మంది విద్యార్థులు హాజరుకాగా 55 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా 6వ తరగతి ప్రవేశానికి 1,623 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా మక్తల్లో రెండు, ధన్వాడ, నారాయణపేట, ఉట్కూర్లో ఒక్కొక్కటి చొప్పున ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,567 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 56 మంది గైర్హాజరయ్యారు. 7వ తరగతి ప్రవేశానికి 843 మంది దరఖాస్తు చేసుకోగా మక్తల్లో రెండు, జాజాపూర్లో ఒకటి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 811 మంది పరీక్ష రాయగా 32 మంది గైరాజరయ్యారు. 8వ తరగతికి సంబంధించి 815 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా దామరగిద్ద (సింగారం), ధన్వాడ, మరికల్లో ఒక్కో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. 787 మంది హాజరుకాగా.. 28 మంది గైర్హాజరయ్యారు. 9వ తరగతి ప్రవేశానికి 478 మంది దరఖాస్తు చేసుకోగా మరికల్, నారాయణపేటలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 446 మంది పరీక్ష రాయగా 32 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తంగా 3,068 బాలురకుగాను 2,973 మంది.. 2,912 మంది బాలికలకుగాను 2,804 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఆయా కేంద్రాల్లో నిర్వాహకులు పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు.
ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష


