మహిళల ఇంధనం
పేటలో తొలి ఇందిరా మహిళాశక్తి పెట్రోల్బంక్ ఏర్పాటు
● నేటితో ఏడాది పూర్తి.. సంబరాల్లో సంఘాల సభ్యులు
● వార్షిక టర్నోవర్ రూ.15.83 కోట్లు
● లాభం రూ.25 లక్షలు
నారాయణపేట: రాష్ట్రంలోనే తొలి మహిళా పెట్రోల్ బంక్ను ఇద్దరు కలెక్టర్ల చొరవ, కృషితో జిల్లాకేంద్రంలోని సింగారం చౌరస్తాలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గతేడాది ఫిబ్రవరి 21న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ బంక్ ఏర్పాటు చేసి శనివారానికి ఏడాది పూర్తికావడం, విజయవంతంగా కొనసాగుతుండటంతో మహిళా సంఘాల స భ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇద్దరు కలెక్టర్ల చొరవతో..
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీఇందిరా మహిళాశక్తి’ని పటిష్టంగా అమలు చేస్తోంది. జిల్లా మహిళా సమాఖ్యలో 8,196 సంఘాలు, 91,369 మంది సభ్యులున్నారు. నాటి కలెక్టర్ కోయ శ్రీహర్ష మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన కల్పించి పెట్రోల్బంకు ఏర్పాటుకు పునాదులు వేశారు. జిల్లాకేంద్రం సమీపంలోని డీఆర్డీఏ కార్యాలయానికి అనుసరించి ఉన్న ఆరు గుంటల ప్రభుత్వ స్థలంలో డీఆర్డీఏ, జడ్ఎంఎస్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి రూ.1.30 కోట్లతో జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్బంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 20 ఏళ్లకు నెలకు రూ.10 వేల అద్దె ప్రాతిపదికన మహిళా సమాఖ్య ద్వారా బంక్ నిర్వహణకు బీపీసీఎల్తో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం వచ్చిన ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా ప్రోత్సహం అందిస్తుండటంతో విజయవంతంగా కొనసాగుతోంది.


