కేంద్రం నిధులతో రాత్రికి రాత్రే శంకుస్థాపనలు
మక్తల్: నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే తనకు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే శంకుస్థాపనలు చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. 30 ఏళ్ల కాలంలో మక్తల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి వాకిటి శ్రీహరి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దివంగత చిట్టెం నర్సిరెడ్డి హయాంలోనే భీమా ప్రాజెక్టు సాధించి.. ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడం జరిగిందన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు మక్తల్కు భారీగా నిధులు మంజూరుచేసి.. అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రమే 60శాతం నిధులు మంజూరు చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా మంత్రి మాట్లాడటం సరైంది కాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ కోరారు. కార్యక్రమంలో కొండయ్య, ఇన్చార్జి అమరనాథ్, రాజశేఖర్రెడ్డి, నర్సింహ, బాలరాంరెడ్డి, భాస్కర్, కర్నిస్వామి పాల్గొన్నారు.


