నారాయణపేట: శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లావ్యాప్తంగా నెల రోజుల పాటు 30 పోలీస్ యా క్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉన్నందున జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నా లు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. పోలీస్ హెచ్చరికలను అతిక్రమిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలను, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాల ను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేస్తామన్నారు. ఏవైనా కార్యక్రమాలు జరపాలనుకుంటే ముందస్తు దరఖాస్తు చేసుకొని, పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
హనుమాన్ శోభాయాత్రలకు
పటిష్ట బందోబస్తు
జిల్లా పరిధిలో నిర్వహించనున్న 62 హనుమాన్ శోభాయాత్రల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. హనుమాన్ శోభాయాత్రల సందర్భంగా ప్రధాన చౌరస్తాలు, సున్నిత ప్రాంతాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశామని, నిరంతర పెట్రోలింగ్ నిర్వహించేందుకు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తామన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ర్యాలీల సమయంలో వీడియో రికార్డింగ్ నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.


