వలస ఓటర్లే కీలకం
అచ్చంపేట: మున్సిపల్ ఎన్నికల్లో వార్డు, కౌన్సిల్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపునకు వలస ఓటర్లే కీలకం కానున్నారు. ఏ వార్డు ఓటర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో రాజకీయ పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లా లోని మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు మిగతా 18 మున్సిపాలిటీల్లోనూ వలస ఓటర్లు అ ధికంగా ఉన్నారు. అయితే జడ్చర్ల, అచ్చంపేట మినహా ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూ త్పూర్, నారాయణపేట, కోస్గి, మద్దూరు, మక్తల్, అమరచింత, ఆత్మకూరు, పెబ్బేరు, కొత్తకోట, వనపర్తి, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, గద్వాల, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనుండటంతో పోటీ చేస్తున్న అభ్యర్థులు వలస ఓటర్ల కోసం పరుగులు పెడు తున్నారు. పోలింగ్కు కేవలం కొన్ని గంటల వ్యవ ధి మాత్రమే ఉండటంతో హైదరాబాద్, బెంగళూర్తో పాటు మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన వారితో పాటు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల నిమిత్తం వెళ్లిన వారి జాబితా పట్టుకొని ఎక్కడెక్కడ ఉన్నారో ఆరా తీశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షకు పైగా ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి మున్సిపాలిటీలో వెయ్యి నుంచి 3, 4 వేల మంది వరకు వలస ఓటర్లు ఉండటంతో అభ్యర్థుల విజయ అవకాశాలపై వీరు ప్రభావం చూపనున్నారు. దీంతో అభ్యర్థుల తరుఫున కొందరు వలస ఓటర్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లి.. ఒకటి రెండు రోజులు అక్కడే ఉండి ఓటు వేసేందుకు రావాల్సిందిగా బతిమిలాడుతున్నారు. వీరిని రప్పించేందుకు అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటే వాహనాలను సమకూర్చుతున్నారు. ఒకరిద్దరు ఉంటే బస్సు చార్జీలకు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు వీరి ఓట్లపైనే ఆధారపడుతున్నారు.
కుల సంఘాలకు గాలం
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ నాయకులు ఓట్ల కోసం కుల సంఘాలకు గాలం వేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకూడదని తెలిసినా గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆలయాలు కట్టిస్తామని, ఇళ్లు, పింఛన్లు ఇప్పిస్తామని, శుభ కార్యాలకు సహకారం అందిస్తామంటూ కుల సంఘాల ఓటర్లకు గాలం వేస్తున్నారు. మీ వార్డులకు సీసీ రోడ్లు, మురుగు కాల్వలు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తున్నారు. ఓట్లు రాబట్టేందుకు కొన్ని సాధ్యం కాని పనులు కూడా చేస్తామని కల్లబొల్లి మాటలు చెబుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇతరులు తమ మద్దతుదారులను బరిలో నిలిపారు. వారి గెలుపు కోసం ఆయా పార్టీల నాయకులు కుల సంఘాలను కలుస్తూ అభ్యర్థులను గెలిపించాలని వేడుకుంటున్నారు. అలాగే వార్డులు, కులాల వారీగా అవసరమైన డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావితం చేసేది వీరే
జీవనోపాధి కోసం వెళ్లినవారి ఓట్ల కోసంనేతల ప్రయత్నాలు
వాహనాలు, బస్సు చార్జీలకు
డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు
హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కార్మికులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షకు పైగానే వలస జీవులు


