ఎన్నాళ్లు ఎదురుచూడాలి..
1951లో ఏర్పడిన చేనేత సహకార సంఘంలో మొదట 4,265 మంది సభ్యులుంటే ప్రస్తుతం కేవలం 72 మందికి మాత్రమే ఉన్నారు. మిగిలిన వారు అందరికి కూడా సభ్యత్వం ఇవ్వాలి. ఇందుకోసం 35 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం.
– వెంకటేష్, చేనేత కార్మికుడు
నారాయణపేట ఎడ్యుకేషన్: ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించి చేనేత కార్మిక సంఘంలో సభ్యత్వం కల్పిస్తామని ప్రతిసారి ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇస్తున్నారే తప్ప నేటికి నెరవేర్చే నాయకుడు కరువయ్యారని స్థానిక గాంధీనగర్ చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 4,265 మంది సభ్యులున్న సొసైటీలో ప్రస్తుతం కేవలం 72 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుత నాయకులైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఆదివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో గాంధీనగర్లో నిర్వహించిన చర్చావేదికలో పలువురు కార్మికులు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు.
ఇదీ సమస్య..
జిల్లాకేంద్రంలో చేనేత సహకార సంఘం 1951లో ఏర్పడింది. అప్పట్లో 4,265 మంది చేనేత కార్మికులు సభ్యులుగా ఉన్నారు. చేనేత కార్మిక సొసైటీ తరుఫున గాంధీనగర్కాలని నిర్మించారు. 104 మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు చేనేత సామగ్రి పంపిణీ చేశారు. ఇందుకుగాను కార్మికుల నుంచి ప్రతినెల రూ.5 చొప్పున రూ.2,475 వసూలు చేశారు. సొసైటీ, ప్రభుత్వం నిర్ణయించిన ధరను 35 ఏళ్ల కిందటే లబ్ధిదారులు తమ వాటా ధనం చెల్లింపు పూర్తి చేశారు. అయినా నేటికీ సొసైటీ నిర్వాహుకులు ఇంటి యజమానులకు రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు.


