పెరుగుతున్న కిడ్నీ సమస్య బాధితులు
నారాయణపేట: జిల్లాలోని మక్తల్, నర్వ మండలాల ప్రజలు కిడ్నీ సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారని.. ప్రభుత్వం తక్షణమే ఉన్నతస్థాయి వైద్య బృందంతో విచారణ జరిపించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్.తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయా మండలాల్లో నిజ నిర్ధారణ బృందం పర్యటించి బాధితులు, గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మక్తల్ మండలం మంతన్గోడ్, ఎర్నాగునపల్లి, కాట్రేవ్పల్లి, నర్వ మండలం రాయికోడ్, జక్కన్నపల్లి, పాతర్చేడ్లో బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెండువేల జనాభా లేని కాట్రేవ్పల్లిలో కిడ్నీ సమస్యతో పదేళ్లలో పదిమందికి పైగా మృతిచెందారని, డయాలసిస్ చేయించుకుంటున్న వారు ఐదుగురు, డయాలసిస్కి చేరువలో 15 మంది ఉన్నారని సమాచారం ఉందని తెలిపారు. ప్రభుత్వం డయాలసిస్ రోగులకు నెలకు రూ.రెండు వేలు ఇచ్చి, మక్తల్లో డయాలసిస్ కేంద్రం ప్రారంభించి చేతులు దులుపుకొనే ధోరణిలో ఉందని, వెంటనే ఉన్నతస్థాయి వైద్య నిపుణుల బృందాన్ని ఆయా మండలాలకు పంపించి సమస్య తీవ్రతకు గల కారణాలను శోధించాలని సూచించారు. ఆయా మండల కేంద్రాల్లో వారానికి రెండుసార్లు నెఫ్రాలజిస్ట్ను అందుబాటులో ఉంచాలని, డయాలసిస్ సెంటర్ సామర్థ్యం పెంచి రోగులకు నెలకు రూ.12 వేలు పించన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ కమిటీలో మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు దిలీప్, తాళ్ల రోహిత్, సభ్యులు శ్రీధర్, వెంకటనారాయణ , బొల్లి ఆదాంరాజు ఉన్నారు.


