అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా
నారాయణపేట: ఎన్నికల సమయంలో ఎవరూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని.. అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్ హక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో స్థానిక పోలీసులు, టీఎస్ఎస్పీ బెటాలియన్తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్.. పాత బస్టాండ్, మెయిన్ చౌక్, సరఫ్ బజార్, పల్లా హనుమాన్ టెంపుల్, జంగిడిగడ్డ, మసుమల్లి దర్గా, అంబా భవాని టెంపుల్, మహంకాళి టెంపుల్, సత్యనారాయణ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా, ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా భద్రతా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలు, భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని అన్నారు. ఫ్లాగ్ మార్చ్లో సీఐ శివశంకర్, ఆర్ఐలు నర్సింహ, విజయభాస్కర్, ఎస్ఐలు నరేష్, వెంకటేశ్వర్లు, రాముడు, కృష్ణ చైతన్య, రాజు, గాయత్రి, శిరీష తదితరులు పాల్గొన్నారు.


