మూడేళ్లలో మక్తల్ రూపురేఖలు మారుస్తాం
మక్తల్: మూడేళ్లలో మక్తల్ రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు చేపడతామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంరతం అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టి.. పట్టణాభివృద్ధికి అండగా నిలవాలని ఓటర్లను కోరారు. ఇప్పటికే మక్తల్లో రూ. 25కోట్లతో మినీ స్టేడియం, రూ. 15కోట్లతో సీసీరోడ్లు, రూ. 210 కోట్లతో మక్తల్–పేట రోడ్డు విస్తరణ, రూ. 43కోట్లతో 150 పడకల ఆస్పత్రి, రూ. 2కోట్లతో తాగునీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు డిగ్రీ కళాశాల, కోర్టు, రిజిస్ట్రార్ కార్యాలయం, 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేసినట్లు వివరించారు. ఎన్నో ఏళ్లుగా దుస్థితికి చేరిన పడమటి ఆంజనేయస్వామి ఆలయ కోనేరును ఆధునికీకరించినట్లు చెప్పారు. పట్టణంలో పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు 340 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. మక్తల్ – పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో 35వేల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలు చెప్పే మాటలు నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో బీకేఆర్ చైర్మన్ బాలకిష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కోళ్ల వెంకటేశ్, కట్ట సురేశ్, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, మాజీ ఎంపీటీసీ కోళ్ల వెంకటేశ్, నాయకులు ఫయాజ్, శ్రీనివాసులు, రంజిత్కుమార్రెడ్డి, గోవర్ధన్, రవికుమార్, రాజేందర్, రహీం పటేల్, శంషొద్దీన్, ఎండీ సలాం తదితరులు పాల్గొన్నారు.


