25న రేషన్ బియ్యం వేలం
నారాయణపేట: జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన రేషన్ బియ్యాన్ని ఈ నెల 25న వేలం వేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాలరాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 644.67 క్వింటాళ్ల బియ్యాన్ని వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్దారులు ఈ నెల 18 నుంచి 21వ తేదీలోగా రూ. 25వేల డీడీ చెల్లించి వేలంలో పాల్గొనాలని తెలిపారు.
సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి: పీయూ వీసీ
మహబూబ్నగర్ న్యూటౌన్: వెనుకబడిన వర్గాల ఆరాద్యుడు సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో నడుచుకోవాలని పాలమూరు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం పాలమూరు యూనివర్సిటీలోని సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహాభోగ్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ పీయూలో సేవాలాల్ మహారాజ్ జయంతిని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో గౌరవంగా బతకాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మధ్యపానం, ధూమపానాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సేవాలాల్ మహారాజ్ ఆనాడే బోధించారన్నారు. ప్రతి మనిషి ఉన్నతంగా జీవించాలని సంత్ సేవాలాల్ మహారాజ్ ఆకాంక్షించారని డా.తేజావత్ బెల్లయ్యనాయక్ అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రాల్ రమేశ్, డా.నాగం కుమారస్వామి, యూనివర్సిటీ పీజీ కాలేజి ప్రిన్సిపాల్ డా.బి.మధుసూదన్రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి డా.కె.ప్రవీణ, న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డా.జె.మాళవి, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కరుణాకర్రెడ్డి, డా.వెంకట్రెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.


