ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకం
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని, కంటిచూపు సక్రమంగా ఉండటం అత్యవసరమని ఎస్పీ డా. వినీత్ అన్నా రు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, పోలీస్ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా.. ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. కంటిచూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని తెలిపారు. కార్యక్రమంలో అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించడమే కాకుండా తగిన చికిత్సలు కూడా పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తామని వివరించారు. వాహనాలు నడిపేటప్పుడు వేగ పరిమితులు తప్పనిసరిగా పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని, కారులో సీట్బెల్ట్, ద్విచక్ర వాహనంపై హెల్మెట్ విధిగా ధరించాలని సూచించారు. వాహనానికి సంబంధించి అన్ని పత్రాలను దగ్గరగా ఉంచుకోవాలని, బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో నిరంతరం పరిశీలించాలన్నారు. మొత్తం 70 మంది డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హూల్హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్, ఆర్ఐలు నర్సింహ, విజయభాస్కర్, కంటి వైద్య నిపుణులు డా. సునీల్, డా. మల్లిక, డా. సాయిఆదిత్య, డా. కనిగిరి శేఖర్, టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణచైతన్య, ఆర్ఎస్ఐలు శ్వేత, శిరీష, పోలీస్ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రం వద్ద అప్రమత్తంగా ఉండాలి
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు ఎస్పీ డా. వినీత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రం 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లు తెరిచి ఉంచరాదని, 163 బీఎన్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులుగా తిరగడం నిషేధమని పేర్కొన్నారు. పోలీసు అధికారులు తమ పరిధిలోని ప్రతి కేంద్రాన్ని సందర్శించి బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్షలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది, ఎగ్జామ్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలని, ప్రశ్నాపత్రాలు పోలీస్స్టేషన్ నుంచి కేంద్రాలకు.. పరీక్ష అనంతరం పోస్టాఫీస్కు తరలించేందుకు ఎస్కార్ట్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని పేర్కొన్నారు.


