సర్వేతో విద్యా ప్రమాణాలు మెరుగు
నారాయణపేట: సర్వే అనేది కేవలం ప్రక్రియ కాదని.. ఇది విద్యావ్యవస్థకు అద్దం పట్టే సాధనమని డీఈఓ గోవిందరాజులు అన్నారు. జిల్లాలో నిర్వహించనున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సర్వేకు సంబంధించి ఛాత్రోపాధ్యాయులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక కేజీబీవీలో సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ప్రాథమిక విద్యా ప్రమాణాలను సమగ్రంగా అంచనా వేసి.. విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడం లక్ష్యంగా సర్వేకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రతి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ నిష్పక్షపాతంగా, ఎలాంటి లోపాలు లేకుండా సర్వే నిర్వహిస్తేనే నిజమైన ఫలితాలు వెలుగులోకి వస్తాయన్నారు. నాలుగేళ్లుగా జిల్లాలో నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాల ప్రభావం ఈ సర్వే ఫలితాల్లో ప్రతిబింబిస్తుందన్నారు. అందుకే ఇది అత్యంత బాధ్యతతో చేయాల్సిన కార్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని నిజాయితీగా నమోదు చేయడంతో సరైన ప్రణాళికలు రూపొందించగలమని.. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ కృషి భవిష్యత్ తరాల అభ్యాసాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. అనంతరం సర్వే నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల వినియోగం, డేటా నమోదు విధానం, సమయపాలన, విద్యార్థులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వంటి అంశాలపై విపులంగా మార్గదర్శనం చేశారు. నిర్ణీత తేదీల్లో కేటాయించిన పాఠశాలలను సందర్శించి సర్వేను సమర్థవంతంగా పూర్తిచేయాలని డీఈఓ సూచించారు. జిల్లాలో ఎంపికచేసిన 68 పాఠశాలల్లో సర్వే నిర్వహించనున్నట్లు శిక్షణ కోర్సు డైరెక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ నెల 25న తెలుగు, 26న గణితం, 27న ఆంగ్లంపై సర్వే ఉంటుందని పేర్కొన్నారు.


