ఏఎస్పీకి అభినందన
నారాయణపేట: రాష్ట్రస్థాయి 4వ పోలీసు స్పోర్ట్స్ మీట్లో జోగుళాంబ జోన్–7 నుంచి పాల్గొన్న జిల్లా అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హూల్ హక్ అత్యుత్తమ ప్రతిభకనబరిచి స్వర్ణ పతకం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం ఎస్పీ డా.వినీత్ ఏఎస్పీని అభినందించారు. 50 ఏళ్ల పైబడిన సీనియర్ అధికారుల లాన్ టెన్నిస్ విభాగంలో పాల్గొన్న ఏఎస్పీ.. అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకం సాధించడం అభినందనీయమన్నారు. క్రీడా రంగంలో పోలీసు అధికారులు రాణించడం జిల్లా పోలీస్శాఖకు గర్వకారణమని.. విధుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రతిభ చాటడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ధర్నా
నారాయణపేట: మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ (సీఐటీయూ) యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోవిందరాజు మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులు ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిలైట్లు, డంపింగ్యార్డు, శ్మశానవాటికల నిర్వహణ తదితర పనులు చేస్తున్నారన్నారు. కార్మికులకు ప్రభుత్వం ప్రతినెలా వేతనాలు చెల్లించకపోవడంతో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మల్టీపర్పస్ వర్కర్ విధానంతో ఉద్యోగ భద్రత కోల్పోయారని.. సెలవులు తీసుకోలేని దుస్థితి నెలకొందని తెలిపారు. పంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించడంతో పాటు మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్కు అందజేశారు. జోషి, చంద్రప్ప పాల్గొన్నారు.
ఏఎస్పీకి అభినందన


