వయో వృద్ధుల సంక్షేమానికి చర్యలు
నారాయణపేట: వయో వృద్ధుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి అవినాష్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాకేంద్రంలోని బాలసదనం, వృద్ధాశ్రమాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించి అందరు ఉన్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. రోజువారి మెనూను పరిశీలించి వసతులు, నిత్యావసర సరుకుల నాణ్యత, తాగు నీరు, శుభ్రత, రిజిస్టర్ల నిర్వహణ, సీసీ టీవీల పనితీరు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ్రమ నిర్వాహకులు అనాథ పిల్లలు, వృద్దులను బాగా చూసుకోవాలని, మౌలిక వసతులు కల్పించాలన్నారు. సకాలంలో ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. మరుగుదొడ్లు, పడక గదులు శుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం చిన్నారులు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.


