అత్తాకోడళ్లకు అగ్నిపరీక్ష..!
పేటలో కమలం వికసిస్తుందా.. హస్తగతం అవుతుందా?
● అంతర్మథంలో ఆశావహులు
● 12కు చేరిన బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య
● కాంగ్రెస్, ఎంఐఎం, ఏఐఎఫ్బీ మైత్రితో 10కి చేరిన కౌన్సిలర్లు
● బీఆర్ఎస్ సైలెంట్తో
పరేషాన్లో అధికార పార్టీ
● ఎంపీ ఎక్స్ అఫీషియో ఓటుతో బీజేపీకి సులువు
నారాయణపేట: స్థానిక పురపాలికలో పాగా వేయడం ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డికి అగ్ని పరీక్షగా మారింది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా.. పేట మినహా మిగిలిన వాటిలో అధికార పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉండటంతో హస్తగతం చేసుకోవడం ఖాయమైనట్లే. కాగా ఇక్కడ బీజేపీ 11, కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 2, ఏఐఎఫ్బీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. బీజేపీ రెబల్గా పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి జయశ్రీ శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమక్షంలో పార్టీలో చేరడంతో ఆ సంఖ్య 12కు చేరింది. ఎంపీ డీకే అరుణ తన ఎక్స్ అఫీషియో ఓటును ఇక్కడే వేసేందుకు దరఖాస్తు చేసుకోవడంతో పీఠం దక్కించుకోవడం నల్లేరు మీద నడకై ందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ట్రై.. టై.. డ్రా..?
సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఎట్టి పరిస్థితిలో హస్తగతం చేసుకోవాల్సిందేనంటూ ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డికి అధిష్టానం నుంచి సాంకేతాలు రావడంతో అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. ఎంఐఎం 2, ఏఐఎఫ్బీ ఒకరితో కలిపి వారి సంఖ్య పదికి చేరింది. బీజేపీలో చేరిన స్వతంత్ర అభ్యర్థిని ఎలాగైనా తమవైపు తిప్పుకోవాలని చేయని ప్రయత్నమంటూ లేదు. ఇక అది ఫలించకపోవడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇద్దరిని కలుపుకొంటే ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో అధికార పార్టీ సైతం 13 స్థానాలకు చేరుకుంటుంది. కాంగ్రెస్, బీజేపీకి సమాన సీట్లు కానుండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ను డ్రా పద్ధతిలో ఎన్నుకునే పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. పేటకు చేరుకున్న ఎమ్మెల్యే..
అనారోగ్య సమస్యలతో మూడు నెలలుగా ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటు వేయాల్సిన పరిస్థితి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఆమె ఆదివారం నారాయణపేటకు చేరుకొని సీవీఆర్ భవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
అధికారపార్టీలోకి ఎవరొచ్చినా ‘కోటీ’శ్వరుడే..
అధికారపార్టీలోకి ఎవరొచ్చినా కోటీశ్వరుడే అవుతారంటూ పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీ నుంచి అధికార పార్టీలోకి ఒక కౌన్సిలర్ వచ్చినా తాము మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు దూతల ద్వారా స్పష్టం చేసినట్లు సమాచారం. వచ్చినట్లు వీడియో కాల్చేసి చూపిస్తే తప్ప తాము నమ్మే పరిస్థితి లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
అత్తాకోడళ్లకు అగ్నిపరీక్ష..!


