● 30 ఏళ్లలో ఇదే మొదటిసారి
● బీడుగా మారుతున్న ఆయకట్టు
● వానాకాలం సాగు కష్టమే..
వెలవెలబోతున్న సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లు
మక్తల్: నియోజకవర్గంలోని సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టి సుమారు 30 ఏళ్లు పూర్తవుతోంది. నాటి నుంచి ఏటా వర్షాకాలంలో కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోయడంతో నీరు సమృద్ధిగా ఉండటంతో ఆయకట్టు రైతులు ఏడాదికి రెండు పంటలు సాగు చేసేవారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవక రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. సంగంబండ రిజర్వాయర్ను 3 టీఎంసీలు, భూత్పూర్ను టీఎంసీ సామర్థ్యంతో నిర్మించారు. కృష్ణానది నుంచి నీటి సరఫరా లేకపోవడంతో నీటిమట్టం అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్లు నిండితే సాగునీటి కష్టాలు తీరుతాయమని నమ్మకంతో ఉన్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ప్రస్తుతం రిజర్వాయరు వట్టిపోయి ఎడారిని తలపిస్తున్నాయి. సంగంబండ రిజర్వాయర్ కింద సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అంది వరి సాగు చేసేవారు. ప్రస్తుతం వర్షాలు లేక ఈ ఏడాది సుమారు 10 వేల ఎకరాలు కూడా నాటు వేయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేవలం బోరుబావులు రైతులు మాత్రమే వరి సాగు చేపడుతున్నారు. రిజర్వాయర్లలో నీరుంటే భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల నుంచి పుష్కలంగా నీరు అవుతుండేది. అయితే బోర్లలో నీటిమట్టం తక్కువ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
నీరు లేక వెలవెలబోతున్న భూత్పూర్ రిజర్వాయర్
భూత్పూర్ రిజర్వాయర్ను 1 టీఎంసీ నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించారు. ఈ రిజర్వాయర్ కింద 45 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. ఈ ఏడాది వర్షాలు లేక రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గింది. గేట్ల నుంచి విడుదల చేసేందుకు సరిపడా నీరు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ రిజర్వాయర్ నుంచి నర్వ, అమరచింత మండలాలకు సాగునీరు సరఫరా చేస్తారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో గుంతలు ఉన్న చోట్ల నీరు నిల్వ ఉంది.


