పార్టీలో కొనసాగాలా?.. జీవన్‌రెడ్డి సంచలన కామెంట్స్ | Jeevan Reddy is unhappy with the Congress party | Sakshi
Sakshi News home page

పార్టీలో కొనసాగాలా?.. జీవన్‌రెడ్డి సంచలన కామెంట్స్

Feb 16 2026 6:09 PM | Updated on Feb 16 2026 7:14 PM

Jeevan Reddy is unhappy with the Congress party

సాక్షి జగిత్యాల:  కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తన పార్టీపై అసహానం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్‌ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి  ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్‌పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు..?

కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి ఛైర్‌పర్సన్ పదవి ఇవ్వాలని మొదటి నుంచీ తాను మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యే నాయకత్వంలోనే పని చేస్తే ఇంకా తాను కాంగ్రెస్‌లో కొనసాగాలా అని ప్రశ్నించారు. జెండా మోసిన కార్యకర్తల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలన్నారు. అభివృద్ధి పేరుతో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఎందుకని ఎమ్మెల్యేను సంజయ్‌ను  ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిన వారికే తాను మద్దతు ఇచ్చానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంత కాలం తమ వర్గంపై  ఈ వేధింపులు కొనసాగుతాయని ఆరోపించారు.ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొనసాగాలా, వద్దా అన్న సందిగ్ధ పరిస్థితి తనకు  నెలకొందని జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా ఛైర్‌పర్సన్‌ను ఎన్నుకోవాలంటే కనీసం 25 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ 23 చోట్ల, స్వతంత్రులు 15 చోట్ల గెలుపొందారు. బీజేపీకి, ఆరు, బీఆర్ఎస్ నాలుగు, ఎంఐఎం రెండు స్థానాలు గెలుచుకున్నాయికాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం నుంచి 33 మంది పోటీ చేయగా 14మంది, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం నుంచి 17మంది పోటీ చేయగా తొమ్మిది మంది విజయం సాధించారు.

స్వతంత్రుల్లో తొమ్మిది మంది జీవన్ రెడ్డి వర్గం కాగా.. నలుగురు ఎమ్మెల్యే వర్గీయులు, ముగ్గురు బీజేపీ రెబల్స్ ఉన్నారు. ఈ క్రమంలో చైర్మన్ పీఠం కోసం జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా సంజయ్ వర్గానికి చైర్‌పర్సన్ పదవి అప్పగించేందుకు నిర్ణయించారు. దీంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement