గుంటూరు: ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు. గత కొంతకాలంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడుకు ఇందుకు ఉదాహరణ అని ధ్వజమెత్తారు. ఈరోజు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) అంబటి కుటుంబాన్ని పరామర్శించారు కారుమూరి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
‘అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీసుపై దాడి ఆటవికం, అరాచకం. లడ్డుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాన్ని అంబటి ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నేతలకు మంచి బుద్ది ప్రసాదించాలని అంబటి పూజలు చేశారు. అంబటి కారుపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వందనాదేవి మహిళ మాట్లాడకూడని మాటలు అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు.పక్కా పథకం ప్రకారం కర్రలు,రాడ్లతో దాడిచేశారు.
లడ్డుపై విషప్రచారం చేసింది మీరే... దాడులు చేసేది మీరే. చేసినవన్నీ చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. జోగి రమేష్ ఇంటిపై ప్రణాళికాబద్దంగా దాడి చేశారు.. మీ పరిపాలన ఎలా ఉందో ఒకసారి సరిచూసుకోండి. ఇది రాచరిక రాజ్యం కాదు. ప్రతిపక్షంగా మేం ప్రశ్నిస్తాం. జగన్ హయాంలో అప్పులపై మీరు అబద్దాలు చెప్పలేదా?, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చెయ్యలేదా?, మంచి పరిపాలన అందించాలే తప్ప ప్రతిపక్షం లేకుండా చెయ్యాలని చూస్తే కుదరదు. దివిసీమ ఉప్పెన తరహాలో ప్రజల ఉప్పెనలో మీరు కొట్టుకుపోతారు.
రాంబాబు పరిధి దాటి మాట్లాడరు. రాంబాబు అసెంబ్లీలో చంద్రబాబు భార్య గురించి మాట్లాడలేదు. లడ్డుప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు మాట్లాడలేదా?, రైతులు,విద్యార్థులు, ఆరోగ్య శ్రీ, పేదలకు మూడు సెంట్ల స్థలాలు ఇవ్వడం గురించి ఆలోచించండి. మీరే మీ ఎమ్మెల్యేలు అరాచకాలు, దోపిడీలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. బిల్ గేట్స్ ను తీసుకొచ్చి షో చెయ్యాలని చూస్తున్నారు. అంబటి రాంబాబును పోలీస్ స్టేషన్లో శారీరకంగా హింసించారు. దాడికి పాల్పడిన వారిని వదిలేసి... దాడికి గురైనవారిని జైలులో పెట్టారు. ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు. ఇలాగే చేస్తే అన్ని కులాలు ఏకమవుతాయి’ అని హెచ్చరించారు.


