సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో భాగంగా పలుచోట్ల హంగ్ ఏర్పడింది. కేస సముద్రం, అలంపూర్, ఇస్నాపూర్, కోహిర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీల ఇండిపెండెంట్లుగా గెలిచిన అభ్యర్థుల కోసం పార్టీలు పోటీపడే అవకాశం ఉంది.
వివరాల మేరకు.. మహబూబాబాద్ జిల్లాలోని కేస సముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా.. చెరో ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో, హంగ్ ఏర్పడింది. మరోవైపు.. అలంపూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా.. చెరో ఐదు చోట్ల బీఆర్ఎస్, ఐదు చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. ఇక, సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ నెలకొంది. ఇస్నాపూర్లో 26 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10, ఇతరులు-4 విజయం సాధించారు. మ్యాజిక్ ఫిజర్ 13 కాగా, ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో, ఇండిపెండెంట్లపై పార్టీలు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.
సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోట గెలిచారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలోనూ అదే తరహా పరిస్థితి నెలకొంది. అక్కడ మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలవగా.. బీజేపీ, ఇతరులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు.
ఏఐఎఫ్బీ ప్రభంజనం..
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఓ మున్సిపాలిటీని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్బీ) దక్కించుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అక్కడ 10 వార్డుల్లో 8 చోట్ల ఏఐఎఫ్బీ గెలిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కో వార్డుకే పరిమితమయ్యాయి. తెలంగాణ జాగృతికి చెందిన నేతలు ఏఐఎఫ్బీ తరఫున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించడం గమనార్హం.
కాంగ్రెస్ హవా.. కారు జోరు..
కాంగ్రెస్: నేరేడుచర్ల, హుజూర్నగర్, హాలియా, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణ ఖేడ్, స్టేషన్ ఘన్పూర్.
బీఆర్ఎస్: గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్
ఫార్వర్డ్ బ్లాక్: వడ్డేపల్లి.


