సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. గెలిచే అభ్యర్థులు దాదాపు ఖరారవడంతో పార్టీలన్నీ క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను శిబిరాలకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు వెంటనే ఎలక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది.
మున్సిపల్ ఎన్నికల చట్టం రూల్ 63 ప్రకారం గెలిచినసదరు అభ్యర్థికి సర్టిఫికేట్ ఇవ్వడం తప్పనిసరని పేర్కొంది. Form XXVII ప్రకారం ఎలక్షన్ సర్టిఫికేట్ అందించాలని తెలిపింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా గుర్తింపు పొందినట్లు ధృవీకరణ చేయాలని తెలిపింది. ఎన్నికల్లో గెలిచినట్లుగా సర్టిఫికేట్ అందుకున్న అభ్యర్థి తప్పనిసరిగా అతని సంతకం చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ అంతా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలోనే జరగాలని ఆదేశించింది.
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ఇదివరకే కొంతమంది అభ్యర్థులను క్యాంపులకు తరలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో తిరిగి వారిని కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.


