15 లక్షల ఓట్లతో అగ్రస్థానంలో నిలిచిన అధికార పార్టీ
బీఆర్ఎస్కు 29 శాతం ఓట్లు
గతంలో ఉన్న 15 శాతం ఓట్లు నిలబెట్టుకున్న బీజేపీ
పార్టీ ల వారీ ఓట్లను వెల్లడించిన ఈసీ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు వచ్చాయనే లెక్క తేలిపోయింది. ఈనెల 11న జరిగిన పోలింగ్లో ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు, ఎంత శాతం ఓట్లు వచ్చాయన్న వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం.. ఈ ఎన్నికల్లో మొత్తం 37,81,232 ఓట్లు పోల్ కాగా, అందులో అత్యధికంగా కాంగ్రెస్కు పోలయ్యాయి. ఈ పార్టీకి మొత్తం 39.8 (దాదాపు 40 శాతం)తో 15,05,006 ఓట్లు వచ్చాయి. గత (2020) మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే 7లక్షల ఓట్లు ఆ పార్టీ కి పెరగడం గమనార్హం. బీఆర్ఎస్కు గత ఎన్నికలతో పోలిస్తే 5 లక్షల ఓట్లు తగ్గాయి. గత ఎన్నికల్లో 15.90 లక్షల ఓట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి 10,87,347 (దాదాపు 29 శాతం) ఓట్లకు పరిమితమైంది.
ఈసారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ల మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపు 11 శాతంగా నమోదైంది. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు 4,17,659 ఓట్లు అదనంగా వచ్చాయి. మరో ప్రతిపక్షమైన బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికలతో పోలిస్తే తగ్గలేదు. గత ఎన్నికల్లో వచ్చిన 15 శాతం ఓట్లను మళ్లీ నిలబెట్టుకుంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో 5.5 లక్షల ఓట్లు పొందిన బీజేపీకి ఈసారి మరో 42 వేల ఓట్లు పెరిగి మొత్తం 5,92,823 ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎం కూడా తన 3% ఓట్లను పదిలపర్చుకుంది.

2020 ఎన్నికల కంటే ఆ పార్టీ కి 3 వేల ఓట్లు అదనంగా వచ్చాయి. కాగా, ఈసారి మూడు ప్రధాన పార్టీ ల తర్వాత అత్యధికంగా ఓట్లు తెచ్చుకుంది స్వతంత్రులే. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన అభ్యర్థులకు పోలైన మొత్తం ఓట్లలో 8.3 శాతం ఓట్లు అంటే 3,14,096 ఓట్లు వచ్చా యని ఈసీ ప్రకటించింది. ఎంఐఎంతో సహా సీపీఐ, సీపీఎం, ఆలిండియా ఫా ర్వర్డ్ బ్లాక్, జేఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఎంబీటీ, ఐయూఎంఎల్.. ఇలా అన్ని పార్టీ ల ఓట్లు కలిపినా ఇండిపెండెంట్ల కంటే తక్కువే కావడం గమనార్హం.


