హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల హంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పీఠం ఎవరికి అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్-సీపీఐల మధ్య చర్చలు సఫలం కావడంతో కొత్తగూడెం మేయర్ పీఠంపై పీటముడి వీడింది.
కాంగ్రెస్-సీపీఐ పొత్తుతో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీనిలో సీపీఐకి మేయర్ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.
కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లలో ఈ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, సీపీఐ రెండూ సమానంగా 22 సీట్లు గెలవడంతో హంగ్ కౌన్సిల్ ఏర్పడింది. అంటే, ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్కు 8 సీట్లు వచ్చాయి. సీపీఐకి అవసరమైతే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని కేటీఆర్ ప్రకటించారు కూడా.
అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పందించారు కూడా. సీపీఐ అనేది తమకు మిత్రపక్షమేనని, కాకపోతే ఇక్కడ విడివిడిగా పోటీ చేశామని నిన్ననే క్లారిటీ ఇచ్చారు. దాంతో కొత్తగూడెంలో కాంగ్రెస్-సీపీఐలు కలిసే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాయనే సంకేతాలిచ్చారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో కొత్తగూడెం కార్పొరేషన్లో నెలకొన్న మేయర్ పదవిపై సందిగ్థత వీడింది.


