కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో కీలక పరిణామం | Karimnagar Municipal Corporation, BJP Strength Reaches Magic Figure After Rebels And Independents Join, Details Inside | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో కీలక పరిణామం

Feb 14 2026 7:25 PM | Updated on Feb 14 2026 7:37 PM

Karimnagar Municipal Corporation: Bjp Strength Reaches Magic Figure

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ బలం.. మ్యాజిగ్‌ ఫిగర్‌కి చేరుకుంది. బండి సంజయ్‌ సమక్షంలో  రెబల్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు బీజేపీలో చేరారు. ఆ ఇద్దరి చేరికతో కార్పోరేషన్‌లో 34కి  బీజేపీ బలం చేరుకోగా.. బండి సంజయ్‌ ఎక్స్‌ అఫీషియో ఓటుతో 35కి బీజేపీ బలం చేరింది. కరీంనగర్‌ కార్పోరేషన్‌ దాదాపు బీజేపీ కైవసం చేసుకున్నట్లయింది.

కరీంనగర్‌లో ఫలితాల తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్‌లో 66 డివిజన్లలో 30 సీట్లు గెల్చుకుని బీజేపీ.. అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లు దక్కించుకోవాలంటే 34 సీట్లు అవసరం. ఎక్స్‌ అఫీషియో మెంబర్లగా ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డిల ఓట్లతో బీజేపీ బలం 33కి చేరింది. ఇప్పటికే మరో ఐదుగురు ఇండిపెండెంట్స్ బీజేపీలో చేరికతో కరీంనగర్ బల్దియాపై కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు బీజేపీకి లైన్ క్లియర్ అయ్యింది. కరీంనగర్‌లో 30 స్థానాలు గెలుచుకుని బీజేపీ పూర్తి ఆధిక్యత ప్రదర్శించింది. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9 స్థానాలకు పరిమితమవడంతో మేయర్‌ పీఠం బీజేపీ వశమవడంనల్లేరు మీద నడకలా ఉంది. 

తెరపైకి ఎక్స్‌అఫిషియో ఓట్లు
ఉమ్మడి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. రాయికల్, మెట్‌పల్లి, జమ్మికుంటలో హంగ్‌ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి చోట్ల ఎక్స్‌అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గపరిధిలోని మున్సిపాలిటీలో ఎక్స్‌అఫిషియో ఓటుహక్కు కలిగి ఉంటారు. తన పరిధిలో రెండు మూడు మున్సిపాలిటీ ఉంటే.. ఎక్కడ అవసరమో అక్కడ ముందే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాని సమయంలో వీరి ఓటు కీలకమవుతుంది. తాజాగా పాత కరీంనగర్‌ జిల్లాలో ఎక్స్‌అఫిషియో ఓట్లపై జోరుగా చర్చ సాగుతోంది.

కరీంనగర్‌లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. మేజిక్‌ ఫిగర్‌ చేరుకోలేదు. అవసరాన్ని బట్టి 10 మంది ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లతోపాటు, ఎక్స్‌అఫిషియో ఓట్లు వినియోగించుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అన్ని పార్టీలు తమ అమ్ముల పొదిలో దాచిన ఈ ఓట్లను అవసరాన్ని బట్టి వినియోగించనున్నాయి. బీజేపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఓట్లు ఉండగా..

కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్‌లో, మేడిపల్లి సత్యం చొప్పదండిలో, ఆది శ్రీనివాస్‌ వేములవాడలో, మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ ధర్మపురిలో, మంత్రి శ్రీధర్‌బాబు మంథనిలో, హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, విజయరమణారావు పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో, రామగుండంలో మక్కాన్‌సింగ్‌ ఓట్లు వినియోగించుకునే అవకాశముంది. వీరే కాకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, భానుప్రసాద రావు ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు గంగుల కమలాకర్, కేటీఆర్, కోరుట్లలో సంజయ్, హుజూరాబాద్‌లో పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ ఓట్లు అందుబాటులో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement