సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్లో ఎంఐఎం పార్టీ.. తమకే మద్దతు ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. నిజామాబాద్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ నేతనే ఉంటారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంలో హాంగ్ వచ్చిన మున్సిపాలిటీల అంశంపై వ్యూహ రచన చేస్తాం. సీపీఐ నేతలతో మాట్లాడుతున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. జగిత్యాలలో కాంగ్రెస్ వాళ్ళే చైర్మన్గా ఉంటారు. మతాన్ని రెచ్చగొట్టినా బీజేపీ ఏం సాధించలేకపోయింది. 90 శాతం గెలవాలని రూల్ ఉందా?. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉండదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా విజయం మాదే. మెగా గ్రేటర్ ఎన్నికలు కూడా మేమే కైవసం చేసుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.
ఇక, అంతకుముందు.. డీసీసీ అధ్యక్షులతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్లో మాట్లాడారు. గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించే బాధ్యత డీసీసీలకు అప్పగించారు. హాంగ్ వచ్చిన మున్సిపాలిటీలలో స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్ధుల మద్దతుపై సాయంత్రంలోగా మున్సిపాలిటీల వారీగా వివరాలు ఇవ్వాలని డీసీసీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. నిజామాబాద్లో హంగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎంఐఎం పార్టీ కీలకంగా మారనుంది.


