సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలతో పాటు వివిధ రకాల పౌరసేవలను మరింత సులభతరం చేసే వాహన్ పోర్టల్ వచ్చే మార్చిలో అందుబాటులోకి రానుంది. తొలుత సికింద్రాబాద్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి అనంతరం గ్రేటర్లోని మిగతా రవాణా కార్యాలయాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంపై ఆర్టీఏ అధికారులు, ఉద్యోగులతో పాటు ఆటోమొబైల్ డీలర్లకు ఈ నెల 16 నుంచి శిక్షణనివ్వనున్నారు.
గ్రేటర్లో 89 లక్షల వాహనాలు
ప్రస్తుతం సారథి పోర్టల్తో డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన పౌరసేవలు అందజేస్తున్న తరహాలోనే మార్చి నుంచి వాహనాలకు సంబంధించిన 52 రకాల సర్వీసులను ‘వాహన్ పోర్టల్’ ద్వారా అందజేస్తారు. ఈ మేరకు అన్ని వాహనాల వివరాలను వాహన్లో నిక్షిప్తం చేస్తారు. ఆర్టీఏ లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో 89 లక్షల వాహనాలున్నాయి. వీటి వివరాలన్నీ వాహన్ పోర్టల్లో చేరుస్తారు. కొత్తగా నమోదయ్యే ప్రతి బండి వాహన్లో నమోదు చేసిన తర్వాతే వినియోగదారుడికి చేరుతుంది. దీంతో వాహనదారులు స్వయంగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
మొదట షోరూమ్ రిజిస్ట్రేషన్లతో ప్రారంభించి అనంతరం అన్ని సేవలూ వాహన్లోకి తెస్తారు. అంతర్రాష్ట్ర బదిలీలు, జిల్లాల మధ్య వాహనాల బదిలీల కోసం ప్రత్యేకంగా వాహనదారులు ఎలాంటి నిరభ్యంతర పత్రాలు అందజేయాల్సిన అవసరం ఉండదు. వాహన్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే బండి బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ సదుపాయం లభించనుంది. యాజమాన్య బదిలీలు సులభతరమవుతాయి.
రోడ్డు ప్రమాదాలు, చోరీ వంటి ఘటనల్లోనూ వాహనాల జాడను తేలిగ్గా కనిపెట్టవచ్చు. డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్స్, డూప్లికేట్ లైసెన్సులు, చిరునామా బదిలీలు, వాహనాల బదిలీలు, పర్మిట్లు, ఫీజుల చెల్లింపు వంటి అన్ని రకాల సర్వీసులు ఆన్లైన్ ద్వారానే లభిస్తాయి. లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలకు మాత్రమే స్వయంగా హాజరుకావాల్సి ఉంటుంది.


