మూడు ముక్కలాట! | Hung verdict in Telangana municipal elections results | Sakshi
Sakshi News home page

మూడు ముక్కలాట!

Feb 15 2026 4:21 AM | Updated on Feb 15 2026 10:44 AM

Hung verdict in Telangana municipal elections results

36 హంగ్‌ మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షలా పాలకమండళ్ల ఏర్పాటు 

రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి అధికారం పంచుకుంటేనే అందలమెక్కే పరిస్థితి

15 చోట్ల కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ లేదా స్వతంత్రుల సహకారం అవసరం 

బీఆర్‌ఎస్, బీజేపీ కలిస్తే 15 చోట్ల కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టేలా ఫలితాలు 

వాటిలో పదింట బీఆర్‌ఎస్, ఐదింట బీజేపీకి ఎక్కువ స్థానాలు.. 

పదవుల పంపకాల్లో 3 పార్టీల వ్యూహాలపై ఆసక్తి 

అధికారికంగా అవగాహన కుదరకుంటే ‘గోడ దూకుళ్లే’ పరిష్కారం! 

ఇప్పటికే జోరుగా సాగుతున్న బేరసారాలు

మరో ఐదు చోట్ల ఇతర పార్టీలు, ఎక్స్‌ అఫీషియోలతో పాగాకు యత్నం

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్ల విలక్షణ తీర్పు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలను సంకటంలో పడేసింది. 36 మున్సిపాలిటీల్లో హంగ్‌ ఫలితాలు రావడంతో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అంశం ఆయా పార్టీల మధ్య మూడు ముక్కలాటగా మారింది. పరస్పరం కత్తులు దూసుకొనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు సహకరించుకుంటేనే కనీసం 15 మున్సిపాలిటీల్లో పాలకమండళ్లు కొలువుతీరే పరిస్థితి నెలకొనడం పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది.

ఒకవేళ ప్రధాన రాజకీయ పక్షాలు సహకరించుకోకుంటే ‘గోడ దూకుళ్లు’ మాత్రమే ఆయా మున్సిపాలిటీల్లో పీటముడి వీడేందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. మరో 12 మున్సిపాలిటీల్లో స్వతంత్రుల సాయంతో, ఇంకో 5 మున్సిపాలిటీల్లో స్వతంత్రులతోపాటు ఎంఐఎం, ‘లెఫ్ట్‌’పార్టీల సాయంతో పాగా వేసేందుకు అధికార పార్టీకి అవకాశం ఉండటంతో ఆ దిశగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. 

ముడిపడిన మున్సిపాలిటీలివే.. 
హంగ్‌ ఫలితాలు వచి్చన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పాగా వేయాలంటే 15 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ మద్దతు తప్పనిసరి కానుంది. ఈ జాబితాలో మెట్‌పల్లి, రాయికల్, అలంపూర్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్‌నగర్, మెదక్, నర్సాపూర్, ఎల్లంపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత, వర్ధన్నపేట, కేతనపల్లి ఉన్నాయి. కేతనపల్లిలో ఇరు పార్టీలు చైర్మన్, వైస్‌చైర్మన్ల పంపకాలపై అవగాహనకు వచ్చేందుకు అవకాశాలు ఉండగా మెట్‌పల్లి, రాయికల్, కామారెడ్డి, జమ్మికుంట, కాగజ్‌నగర్, మెదక్, నర్సాపేర్, ఎల్లంపేట, నారాయణపేట, ఖానాపూర్, ఇంద్రేశం, జిన్నారం, అమరచింత మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ కలిస్తే సులువుగా చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవులు చేజిక్కించుకొనే అవకాశం ఉంది. మెట్‌పల్లి, రాయికల్, కామారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్‌లలో బీజేపీకి ఎక్కువ స్థానాలు రాగా మిగిలిన చోట్ల బీజేపీ కంటే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ కౌన్సిలర్‌ స్థానాలు వచ్చాయి. కానీ రాజకీయంగా ఏ రెండు పార్టీలు కలిసినా మూడో పార్టీకి లబ్ధి కలుగుతుందనే అంచనాతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ వెనుకంజ వేస్తున్నాయి. 

గైర్హాజరు... గోడ దూకుళ్లు 
ప్రధాన పార్టీలు మూడు దిక్కులుగా ఉన్న పరిస్థితుల్లో మిగిలిన ప్రత్యామ్నాయాలపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారికంగా అవగాహన కుదుర్చుకోకపోయినా స్థానిక నేతల మధ్య జరిగే చర్చలను బట్టి ఒక పార్టీ గెలుపు కోసం మరో పార్టీ గైర్హాజరైతే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చలు జరుగుతాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే అలా గైర్హాజరు కావడం ద్వారా మేజిక్‌ ఫిగర్‌లో మార్పులు వస్తే ఇబ్బందులు వస్తాయని.. నేరుగా మద్దతివ్వడమే పరిష్కారమని అంటున్నాయి. ఈ రెండు మార్గాలు కుదరని పక్షంలో మరో పార్టీకి చెందిన కౌన్సిలర్లను లాక్కోవడమే మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగితే అధికార పార్టీకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే పలు చోట్ల స్వతంత్రులు కాంగ్రెస్‌లో చేరడమో లేదా మద్దతు ప్రకటించడమో జరిగిపోయింది. అయితే ఇందుకోసం రూ. లక్షల నుంచి రూ. కోట్ల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. 

స్వతంత్రుల సాయం తీసుకుంటే.. 
రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్‌ 12 మున్సిపాలిటీలను గెలిచే అవకాశం ఉందని ఫలితాలు చెబుతున్నాయి. జనగామ, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మొయినాబాద్, ఇస్నాపూర్, కోహిర్, పరిగి, పోచంపల్లి, జగిత్యాల, వేములవాడ, దేవరకద్ర, వికారాబాద్‌ మున్సిపాలిటీల్లో స్వతంత్రులుగా గెలిచిన వారు కాంగ్రెస్‌ వైపు వస్తే ఆ స్థానాలు అధికార పార్టీ వశం అవుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఒక్క ఎక్స్‌ అఫీషియో ఓటుతో కేసముద్రం మున్సిపాలిటీని కూడా గెలుచుకోవచ్చు. 

దీంతో అధికార పార్టీ ఖాతాలో ఈ 13 మున్సిపాలిటీలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితోపాటు గద్వాల, మహబూబాబాద్, నారాయణపేట, జహీరాబాద్, బోధన్‌లలో స్వతంత్రులతోపాటు లెఫ్ట్, ఎంఐఎంలు సహకరిస్తే ఆయా పీఠాలు కూడా అధికార పార్టీకి లభిస్తాయి. ఇక ఆలియాబాద్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌కు మూడు స్థానాలు తక్కువ పడగా ఒక స్వతంత్ర, ఒక బీఎస్పీ కౌన్సిలర్‌ను కాంగ్రెస్‌ తన వైపునకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో మరొకరు అవసరం కాగా బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్‌కు వైస్‌చైర్మన్‌ పదవిని ఆఫర్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్‌ ఖాతాలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. 

సీఎం వద్దకు వడ్డేపల్లి కౌన్సిలర్లు 
వడ్డేపల్లి మున్సిపాలిటీలో సంచలన విజయం సాధించిన ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ)కు చెందిన 8 మంది కౌన్సిలర్లు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలో చేరినట్టయింది. స్థానిక నేత వడ్డేపల్లి శ్రీనివాస్‌ నేతృత్వంలో సీఎంను కలిసిన వారిలో కౌన్సిలర్లు కుర్వ పావని, శారద, మంజుల, యుగేందర్‌రెడ్డి, దేవమ్మ, విజయభాస్కర్, జయశ్రీ, ఎరుకల తిమ్మప్ప ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళికా కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ జి. చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌. సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement