సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం రేవంత్రెడ్డి ఇంతటి దౌర్జన్యకాండకు దిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
రెండేళ్ల పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో ఇంతటి దౌర్జన్యకాండకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం, పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే అడుగడుగునా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
అక్రమంగా లూటీచేసిన వేలకోట్ల ప్రజాధనంతో, ప్రజాతీర్పునే మార్చాలన్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీసుశాఖను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకిచ్చిన హామీలను, మొత్తంగా పరిపాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం రేవంత్ రెడ్డిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటది’ అని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు..
ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కు కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత…— KTR (@KTRBRS) February 11, 2026


