సాక్షి, హైదరాబాద్: జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసి.. రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని ఎస్ఈసీ ఆదేశించింది. ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఎస్ఈసీ మండిపడింది.
ఈసీ ఆదేశాలు.. జగ్గారెడ్డి రియాక్షన్..
ఈసీ ఆదేశాలపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. దొంగ ఓటర్లను అడ్డుకున్న మాపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టా? అంటూ ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారని.. దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సీఐ శివకుమార్ పట్టుకున్నారు. దీంతో నేను అక్కడికి వెళ్లాను.. గొడవ జరిగింది’’ అంటూ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు?. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కారా?. దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్, అధికారుల విఫలమయ్యారంటూ జగ్గారెడ్డి ఆరోపించారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ 34వవార్డులో ఇవాళ జగ్గారెడ్డి హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. సీఐ.. కాంగ్రెస్ కార్యకర్త చొక్కాను పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పోలింగ్ ఆపేస్తానంటూ బూత్లోకి దూసుకెళ్లారు. పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం అందుకున్నారు. పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తోపులాట కూడా జరిగింది. సీఐ శివకుమార్ ఇక్కడకు రావాలంటూ పోలీసులపై జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికే సీఐ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


