తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే సొంతంగానే మెజార్టీ సాధిస్తుందని ప్రకటించారు. ఆ పార్టీకి పొత్తులతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నారు.
ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. ఈ అంశంపైనే ఇటీవల DMK ఎంపీ MP కనిమెుళి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సారి కాంగ్రెస్కు అధిక సంఖ్యలో సీట్లతో పాటు మంత్రివర్గంలోనూ చోటు కావాలని కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డీఎంకే అధినేత ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
డీఎంకే ఒంటరిగానే మెజార్టీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అంతేకాకుండా 2021 లో సాధించిన స్థానాల కంటే ఈ ఏడాది మరిన్ని అధిక సీట్లు గెలుస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు సాధించి స్వంతంగానే అధికారం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 25 సీట్లలో పోటీ చేసి 18 స్థానాల్లో గెలిచింది. అయినప్పటికీ మంత్రి వర్గంలో చోటు దక్కలేదు.
అయితే ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ గతంతో పోలిస్తే మరిన్ని అధిక స్థానాలు కోరుతుందని తెలుస్తోంది. మంత్రి వర్గంతో పాటు రాజ్యసభ స్థానంకోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల సీట్ల షేర్ అంశాలు ఈ నెల 22నుంచి ప్రారంభమవుతాయని డీఎంకే పార్టీ ప్రకటించింది. కాగా ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సినీనటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.


