న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీలపై మంత్రి కిరణ్ రిజిజు సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ స్పీకర్ చాంబర్లో కాంగ్రెస్ ఎంపీలు అత్యంత అనుచితంగా ప్రవర్తించారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన సుమారు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్లోకి చొరబడి, ఆయనను దూషించారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, స్పీకర్ ఎంతో సంయమనం పాటించారని రిజిజు తెలిపారు. స్పీకర్ మృదుస్వభావి కనుకనే సరిపోయిందని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకునేవారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వివాదం వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉందంటూ రిజిజు విమర్శలు గుప్పించారు. ఎంపీలు స్పీకర్ను దూషిస్తున్న సమయంలో ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ తదితర సీనియర్ నేతలు కూడా ఛాంబర్లోనే ఉన్నారని ఆయన తెలిపారు. ఎంపీలను వారించాల్సింది పోయి, స్పీకర్తో వాదనకు దిగాలని, గొడవ చేయాలని వారు ప్రోత్సహించారని రిజిజు ఆరోపించారు. ఈ ఘటన పార్లమెంటరీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ నిబంధనల ప్రకారం ఈ నోటీసును సమర్పించారు. 118 మంది ఎంపీల మద్దతుతో ఈ తీర్మానాన్ని తీసుకొచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
#WATCH | Delhi: Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "... At least 20-25 Congress MPs entered the Lok Sabha Speaker's chamber and abused him. I was also there. The Speaker is a very soft person, otherwise strict actions would have been taken. Senior Congress… pic.twitter.com/4SQ8eGEZ3X
— ANI (@ANI) February 11, 2026


