ముంబై మేయర్‌గా రీతూ తావ్డే ఏకగ్రీవం | BJPs Ritu Tawde elected BMC Mayor | Sakshi
Sakshi News home page

ముంబై మేయర్‌గా రీతూ తావ్డే ఏకగ్రీవం

Feb 11 2026 1:05 PM | Updated on Feb 11 2026 1:11 PM

BJPs Ritu Tawde elected BMC Mayor

ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చరిత్రలో కొత్తదనం చోటుచేసుకుంది. బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ముంబై నూతన మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 40 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక పదవిని బీజేపీ దక్కించుకోవడం ఇదే తొలిసారి. శివసేన (యూబీటీ) అభ్యర్థిని బరిలోకి దింపకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనితో  బీఎంసీపై 25 ఏళ్లుగా సాగుతున్న థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శివసేన నేత సంజయ్ ఘాడీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

53 ఏళ్ల రీతూ తావ్డే ఘాట్‌కోపర్ వెస్ట్ నుండి మూడుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. క్షేత్రస్థాయి రాజకీయాలు, ప్రజా సంక్షేమ రంగాల్లో ఆమెకు దశాబ్ద కాలానికి పైగా అనుభవం ఉంది. 2012లో వార్డు 127 నుండి తొలిసారిగా బీఎంసీలోకి అడుగుపెట్టిన ఆమె, 2017లో వార్డు 121 నుండి తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల జనవరి 15న జరిగిన ఎన్నికల్లో వార్డు 132 నుండి ఘనవిజయం సాధించి తన పట్టును మరోమారు నిరూపించుకున్నారు. గతంలో ఆమె ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ చైర్‌పర్సన్‌గా కూడా సేవలందించారు.

మొత్తం 227 స్థానాలు ఉన్న బీఎంసీలో బీజేపీ 89 సీట్లు గెలుచుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాని మిత్రపక్షమైన శివసేన 29 స్థానాలను దక్కించుకుంది. 118 మంది కార్పొరేటర్ల బలంతో బీజేపీ నేతృత్వంలోని 'మహాయుతి' కూటమి మేయర్ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకుంది. 1997 నుండి సుమారు 25 ఏళ్ల పాటు బీఎంసీని పాలించిన శివసేన (యూబీటీ) ఈసారి 65 స్థానాలకే పరిమితమైంది. వారి మిత్రపక్షాలైన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) ఆరు స్థానాలను, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకున్నాయి. సంఖ్యాబలం లేకపోవడంతో మేయర్ అభ్యర్థిని నిలబెట్టకూడదని శివసేన (యూబీటీ) నిర్ణయించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement