కరీంనగర్లో బీజేపీని ఓడించేందుకు ఈ రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్.. పెద్ద ఎత్తున ఓట్లను కొనేందుకు కుట్ర
విజయ సంకల్ప ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లో కబడ్డీ ఆట మొదలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇండియా పేరుతో బీజేపీ, పాకిస్తాన్ పేరుతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి కబడ్డీ ఆటను ప్రారంభించాయన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు ఖాయమని, కబడ్డీ కప్ బీజేపీ గెలుచుకోవడం తథ్యమని తేలడంతో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య రూ.100 కోట్ల డీల్ (మ్యాచ్ ఫిక్సింగ్) కుదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ డబ్బుతో పెద్ద ఎత్తున ఓట్లను కొనుగోలు చేసి, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ‘విజయ సంకల్ప ర్యాలీ’నిర్వహించారు. బీజేపీ తెలంగాణ ఇన్చార్జి, మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆశీష్ షెల్లార్, మాజీ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెవెన్యూ గార్డెన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వేలాది మంది కాషాయ పగిడీలు ధరించి పాల్గొన్నారు. టవర్ సర్కిల్ వద్ద బండి సంజయ్, నవనీత్ కౌర్ ప్రసంగించారు.
అభివృద్ధి నినాదంతో తాము కరీంనగర్ ఎన్నికలకు వెళ్తున్నామని, బీజేపీ 50 సీట్లు గెలిచి మేయర్ పీఠాన్ని అందుకోబోతోందని సర్వేలన్నీ తేల్చడంతో కాంగ్రెస్, ఎంఐఎం నేతల వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. అందుకే ఒవైసీ శనివారం రాత్రి కరీంనగర్కు వచ్చి ఎంఐఎం గేర్ మారుస్తుందని మాట్లాడారని గుర్తు చేశారు. రామాయణం, మహాభారతంలో రావణుడు, కౌరవులకు ఏ గతి పట్టిందో.. ఎంఐఎంకు కూడా అదే గతి పట్టించేదాకా విశ్రమించే ప్రసక్తే లేదని అన్నారు.


