పురపాలక సంఘాల ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల తాయిలాలు
పోలింగ్ స్లిప్పులతోపాటు కొన్ని చోట్ల మద్యం సీసాలు
అపార్ట్మెంట్ల వారీగా సిట్టింగ్లు..మహిళలతో గెట్ టుగెదర్లు
దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రయాణ భత్యాల ఆఫర్
ఇంకా ఊపందుకోని డబ్బు పంపిణీ...
ఒక్కో ఓటుకు కనీసం రూ.1,000 ఇస్తారనే ప్రచారం
కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్.. ఓటుకు రూ.5 వేలు?..
రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు పంచే అవకాశం
వార్డుకు రూ.15–40 లక్షలు, డివిజన్కు రూ.25 లక్షల నుంచి రూ. కోటిన్నర వరకు ఖర్చవుతుందని అంచనా
చికెన్, మటన్,స్వీట్ ప్యాకెట్లు, కూల్డ్రింక్స్,బిర్యానీలు,చీరలు, స్టీల్ క్యాన్ల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దండాలు, ఉపన్యాసాలు, వాగ్దానాలను మాత్రమే నమ్ముకోకుండా వ్యక్తిగత ప్రయోజనాలు సమకూర్చే పనిలో పడిపోయారు. ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగియనుండటం, పోలింగ్కు సమయం సమీపిస్తుండటంతో వీలున్నన్ని మార్గాల్లో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.
మద్యం, మాంసం, కూల్డ్రింక్స్, చీరలు, బిర్యానీలతో పాటు స్టీల్ సామాన్లు కూడా పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమం నేటి నుంచి మరింత ఊపందుకుంటుందని, వీటన్నింటితోపాటు ఆయా మున్సిపాలిటీలు, వార్డులు,కార్పొరేషన్లు, డివిజన్ల వారీగా ఓటుకో రేటు నిర్ణయించిన రాజకీయ నాయకులు ఈ మేరకు అంతా సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
ప్రస్తుతానికి సామూహిక సమావేశాలు
పోలింగ్కు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రచారం జోరందకుంది. సోమవారం సాయంత్రంతో ప్రచారానికి గడువు ముగియనుండడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు వార్డులు, డివిజన్లను చుట్టుముడుతున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి గల్లీల్లో తిరుగుతూ, మైకుల హోరులో ప్రచారాన్ని సాగిస్తూనే వ్యక్తిగతంగా ఇళ్లకు వెళ్లి కలిసి వçస్తున్నారు.అపార్ట్మెంట్లలో సామూహిక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
పురుష ఓటర్లకు మద్యంతో కూడిన సిట్టింగ్లను ఏర్పాటు చేస్తుండగా, మహిళా ఓటర్ల కోసం టిఫిన్లు, స్నాక్స్, కూల్డ్రింక్స్లతో గెట్ టు గెదర్ పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ సామూహిక సమావేశాల పర్వం ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో చికెన్, మటన్, బిర్యానీలు సమకూరుస్తున్నారు. తాయిలాల్లో భాగంగా కొన్ని చోట్ల పోలింగ్ స్లిప్పులతో పాటు మద్యం సీసాలు పంపిణీ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు చీరలు, స్టీల్ సామాన్లు కూడా పంపిణీ చేస్తున్నట్టు సమాచారం.
ప్రయాణ ఖర్చులు ఇచ్చి మరీ...!
ఒక్కో ఓటు కీలకంగా మారుతున్న పరిస్థితుల్లో దూర ప్రాంతాల నుంచి రావాల్సిన ఓటర్ల కోసం కూడా అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి కోసం ప్రయాణ ఖర్చులు ఇచ్చి మరీ వారిని రప్పించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఎంత నగదు ఇవ్వాలో కూడా ఫిక్స్ చేశారు. వార్డులు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు, మున్సిపాలిటీల స్థాయిని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల రూ.10వేల వరకు ఓటుకు రేటు పలుకుతుందని, అయితే, ప్రచార పర్వం ముగిసిన తర్వాత ఈ నగదు పంపిణీపై అభ్యర్థులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తోంది.
నగదు పంపిణీ వ్యవహారాలపై ఓ రాష్ట్రస్థాయి నేత మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో భారీస్థాయిలో డబ్బులు ఖర్చు అవుతున్నాయని తెలిపారు. కేవలం ప్రచారమే కాకుండా తాయిలాల కోసం ఒక్కో వార్డుకు కనీసం రూ.15 లక్షలు ఖర్చవుతున్నాయని చెప్పారు. చిన్న వార్డుల్లో రూ.15–25 లక్షల వరకు ఖర్చు వస్తోందని, మిగిలిన చోట్ల కోటిన్నర రూపాయలు కూడా అవుతున్నాయని, సగటున ఓ మోస్తరు మున్సిపాలిటీల్లో వార్డు లేదా డివిజన్కు రూ.40 నుంచి రూ.70 లక్షల వరకు ఖర్చు జరుగుతుందని ఆయన వెల్లడించడం గమనార్హం. మరో విశేషమేమిటంటే... కొన్ని చోట్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అప్పులు చేసి, ఆస్తులు తనఖా పెట్టి మరీ వడ్డీలకు డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతున్నారు.
నేటితో ప్రచారానికి తెర
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. ఈనెల మూడో తేదీన బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలిన తర్వాత నాలుగో తేదీ నుంచి ప్రచార పర్వం ఊపందుకుంది. గత ఐదు రోజులుగా కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు చివరి రోజు సుడిగాలి పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈనెల 11న పోలింగ్ జరగనుండగా, 13వ తేదీన కౌంటింగ్ జరగనుంది. 16వ తారీఖున మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుంది.


