ఖమ్మం: కొత్తగూడెం కార్పొరేషన్ ఉత్కంఠ రేపుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్లో హంగ్ ఏర్పడగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. కొత్తగూడెంలో సీపీఐ తన సత్తా చాటింది. మొత్తం 60 డివిజన్లకు కాంగ్రెస్ 20, సీపీఐ 24 చోట్ల గెలుపు సాధించాయి. కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్వీస్ట్ ఇచ్చింది. సీపీఐకి బీఆర్ఎస్ (9) బహిరంగ మద్దతు ప్రకటించింది. సీపీఐ.. బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటుందా? కాంగ్రెస్తో జత కడుతుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగూడెంలో బీజేపీ 1, ఇతరులు 5 స్థానాలు దక్కించుకున్నాయి.
ఫలితాలపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కొత్తగూడెం ప్రజలు సీపీఐని ఆదరించారన్నారు. ‘‘కేటీఆర్ మాకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. ఇండిపెండెట్లు కూడా మద్దతు ఇస్తున్నారు. మేయర్ పదవిని కైవసం చేసుకుంటాం, మేయర్ పదవిని గిరిజనులకే ఇస్తాం. మేం కాంగ్రెస్తో చర్చలు జరపలేదు. జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని.. మేయర్ సీట్ను త్యాగం చేయటం కుదరదంటూ కూనంనేని తేల్చి చెప్పారు.
మరోవైపు, కొత్తగూడెంలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేశామని.. సీపీఐ తమ మిత్ర పక్షం అని కాంగ్రెస్ అంటోంది. మాకు, సీపీఐకి కలిసి 44 స్థానాలు వచ్చాయని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవడానికి సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తమ అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు సీపీఐ ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. మరోవైపు, బీఆర్ఎస్ గెలిచిన 8 స్థానాలు అత్యంత కీలకంగా మారాయి.


