హంగు.. కొత్త రాజకీయ రంగు | Face of municipalities in Telangana state is changing | Sakshi
Sakshi News home page

హంగు.. కొత్త రాజకీయ రంగు

Feb 16 2026 2:43 AM | Updated on Feb 16 2026 2:43 AM

Face of municipalities in Telangana state is changing

కాంగ్రెస్‌+బీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌+బీజేపీ.. కాంగ్రెస్‌+బీజేపీ

స్థానిక పరిస్థితులు, సమీకరణాల ఆధారంగా జతకడుతున్న ప్రధాన రాజకీయ పక్షాలు

బీజేపీ, స్వతంత్రుల మద్దతుతో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ గెల్చుకోనున్న కాంగ్రెస్‌ 

గద్వాల, అమరచింతలలో కలిసి పావులు కదుపుతున్న బీఆర్‌ఎస్, బీజేపీ... నారాయణపేటకూ ముడి? 

బోధన్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య అవగాహన..

కొన్ని చోట్ల స్వతంత్రులను ప్రతిపాదిస్తున్న పార్టీలు 

ఖానాపూర్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకి..!

అధికారాన్ని పంచుకుంటారా అన్న దానిపై రాని స్పష్టత 

జిన్నారంలో బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య అవగాహన... మెదక్, నర్సాపూర్‌లలో కాంగ్రెస్, బీజేపీ 

జనగామ, తొర్రూరు, భైంసాలో అదృష్టం ఎవరిని వరిస్తుందో.. టాస్‌ ఎవరికి పడుతుందో? 

తొర్రూరులో బీఆర్‌ఎస్‌కు వ్యూహాత్మక చెక్‌ పెడుతున్న అధికార కాంగ్రెస్‌ పార్టీ.. మహబూబాబాద్‌,ఆదిలాబాద్‌లలో స్వతంత్రులను వరించనున్న అదృష్టం? 

భైంసాలో కంగాళీ... స్వతంత్రుల నిర్ణయంపైనే ఆసక్తి 

హంగ్‌ ఏర్పడిన చోట్ల చాలా స్థానాల్లో కాంగ్రెస్‌కే మొగ్గు

బీఆర్‌ఎస్‌కు 4, బీజేపీకి ఒకట్రెండు పీఠాలు దక్కే చాన్స్‌  

రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖచిత్రం మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులు, అవగాహనలు కుదురుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్బన్‌ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కొన్నిచోట్ల కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌–బీజేపీ, ఒక్కోచోట కాంగ్రెస్‌–బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళుతుండడం, మజ్లిస్, ఏఐఎఫ్‌బీలు కాంగ్రెస్‌ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతోంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కని 36 పురపాలికల్లో గత రెండు రోజులుగా మారిన రాజకీయ సమీకరణలను బట్టి సోమవారం జరిగే మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా మారనుంది. కొన్ని చోట్ల లాటరీ వరకు వెళ్లనుండగా, మరికొన్ని చోట్ల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చిన వాటితోపాటు మరో 20 స్థానాలు ఆ పార్టీ పరమయ్యే చాన్స్‌ ఉంది. హంగ్‌ పరిస్థితులు ఏర్పడిన వాటిలో బీఆర్‌ఎస్‌కు నాలుగైదు, బీజేపీకి ఒకట్రెండు మున్సిపాలిటీలు దక్కనున్నాయని తెలుస్తోంది.  
– సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌

మహబూబాబాద్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌కు 19 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్‌ నుంచి 13, బీఆర్‌ఎస్‌ నుంచి 12 మంది గెలిచారు. కాంగ్రెస్‌కు ముగ్గురు సీపీఎం, బీఆర్‌ఎస్‌కు ముగ్గురు సీపీఐ సభ్యులు మద్దతిస్తున్నారు. వీరు కాకుండానే ఇంకా మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన మరో ముగ్గురి కోసం స్వతంత్రులకు అధికార కాంగ్రెస్‌ గాలం వేసింది. ఈ ప్రయత్నాలు సఫలం కావడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్‌ పార్టీనే పీఠం దక్కించుకోనుంది. అయితే, చైర్మన్‌గా కాంగ్రెస్‌లో చేరిన ఇండిపెండెంట్‌ అయ్యే అవకాశం ఉంది.  

⇒ తొర్రూరు: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన 9 మంది బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు. ఇక్కడ ఆ పార్టీకే మున్సిపల్‌ పీఠం దక్కే మెజారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిలను రంగంలోకి దింపుతోంది. ఇద్దరినీ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా నమోదు చేయించింది. దీంతో ఇరు పార్టీల బలం తొమ్మిదికి చేరనుంది. ఇక్కడ కూడా టాస్‌ అనివార్యం కానుంది.  

⇒ ఆసిఫాబాద్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిర్‌ ఫిగర్‌ 11. ఇక్కడ కాంగ్రెస్‌కు ఏడుగురు, బీఆర్‌ఎస్‌కు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు కాంగ్రెస్‌లో చేరగా ఈ మున్సిపాలిటీ ఆ పార్టీ పరం కానుంది.  

⇒ ఖానాపూర్‌: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 7. ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు 4 చొప్పున రాగా, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. ఒక స్వతంత్రుడు కాంగ్రెస్‌లో చేరడంతో వారి బలం 4కు చేరింది. ఇప్పుడు మూడు పార్టీల బలం సమంగా ఉంది. అయితే, ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు (కాంగ్రెస్‌) నమోదు కావడం, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి ఒక్కో స్వతంత్రుడు కాంగ్రెస్‌ వైపునకు వచ్చారన్న ప్రచారంతో ఈ మున్సిపాలిటీ హస్తగతం కావొచ్చు.లేదంటే 3 పార్టీలు అధికారాన్ని పంచుకునే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి.  

⇒ ఆదిలాబాద్‌: మ్యాజిక్‌ ఫిగర్‌కు నాలుగు తక్కువగా 21 వార్డుల్లో విజయం సాధించిన బీజేపీని నిలువరించడమే కర్తవ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు కూటమి కట్టాయి. తమ పార్టీల నుంచి కాకుండా స్వతంత్రుడిని చైర్మన్‌ చేయాలని నిర్ణయించాయి. దీంతో కాంగ్రెస్‌ (11), బీఆర్‌ఎస్‌ (6), ఎంఐఎం (6)తో పాటు స్వతంత్రుల మద్దతుతో ఈ మున్సిపాలిటీ పీఠంపై ఇండిపెండెంట్‌ కూర్చునే అవకాశాలున్నాయి.  

⇒ భైంసా: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 14. ఇక్కడ ఎంఐఎం 12 వార్డులు గెలిచింది. కాంగ్రెస్‌ నుంచి ఒకరు కలిపితే ఆ పార్టీ బలం 13కు చేరనుంది. బీజేపీ నుంచి ఆరుగురు గెలిచారు. ఆ పార్టీకి ఐదుగు­రు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్‌ అఫీషియో ఓట్లతో బీజేపీ బలం కూడా 13కు చేరింది. మరో ఇద్ద­రు స్వతంత్రులు ఎంఐఎం వ్యతిరేక వర్గంగా ఉన్నారు. వీరు ఎవ­రికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ ఇద్దరు స్వతంత్రుల మనసు మారకపోతే ఏ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ వచ్చే అవకాశం లేదు.  


 కాగజ్‌నగర్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 16. ఇక్కడ కాంగ్రెస్‌కు 9 మంది, బీఆర్‌ఎస్‌కు 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఐదుగురు, స్వతంత్రులు కలిపి కాంగ్రెస్‌కు మద్దతివ్వనుండడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్‌ ఖాతాలోకే వెళ్లనుంది.  
⇒ క్యాతనపల్లి: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 12 స్థానాలకుగాను ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న బీఆర్‌ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. బీఆర్‌ఎస్‌(10), సీపీఐ(4)ల మద్దతుతో ఈ స్థానం బీఆర్‌ఎస్‌ పరం కానుంది.  

⇒ బెల్లంపల్లి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 18 కాగా, ఇక్కడ పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 14 మందిలో ఇద్దరు బీఆర్‌ఎస్‌ పక్షం చేరడంతో ఆ పార్టీ బలం 12కు తగ్గింది. అయితే, నలుగురు ఇండిపెండెంట్లతో మళ్లీ 16కు పెరిగింది. ఇక, 14 మంది కౌన్సిలర్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ పక్షాన ఇద్దరు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు చేరడంతో ఆ పార్టీ బలం కూడా 16కు చేరింది. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌లు ఈ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా కాంగ్రెస్‌ జెండానే ఎగురవేయాలనే వ్యూహంతో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో కూడా వారు టచ్‌లో ఉన్నట్టు సమాచారం.  

⇒ బోధన్‌ : ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 20. కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం నుంచి గెలిచిన 12 మంది మద్దతుతో ఇక్కడ కాంగ్రెస్‌ పాగా వేయనుంది. మున్సిపల్‌ చైర్మన్‌ విషయంలో ఎంఐఎం కొంత విభేదించినా చివరకు కాంగ్రెస్‌ ఇష్టానికే చైర్మన్‌ అభ్యరి్థత్వాన్ని వదిలేయడంతో కథ సుఖాంతమైంది.  

⇒ కామారెడ్డి: ఈ మున్సిపాలిటీలో బీజేపీకి చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పావులు కదుపుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం 25 మంది సభ్యుల బలం కావాల్సి ఉండగా, బీజేపీకి 16 మందితో పాటు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు 19, బీఆర్‌ఎస్‌ 11 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. కాంగ్రెస్‌కు చైర్మన్, బీఆర్‌ఎస్‌కు వైస్‌చైర్మన్‌ దక్కే అవకాశాలున్నాయి.  


⇒ అలంపూర్‌: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు ఆరుగురి బలం కావాలి. బీఆర్‌ఎస్‌కు ఐదు, కాంగ్రెస్‌కు ఐదు వచ్చాయి. ఎమ్మెల్యే విజయుడు ఎక్స్‌ అఫీషియో ఓటుతో  గులాబీ జెండా ఎగరనుంది.

⇒ జనగామ: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 16. కాంగ్రెస్‌కు 12, బీఆర్‌ఎస్‌కు 13 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సీపీఎం కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తోంది. దీంతో ఆ పార్టీ బలం 13కు చేరుతుంది. నలుగురు స్వతంత్రులు గెలవగా.. ఇద్దరు బీఆర్‌ఎస్, ఒకరు కాంగ్రెస్‌ క్యాంపులో ఉన్నారు. జనగామలోనే ఉన్న మరో కౌన్సిలర్‌ కాంగ్రెస్‌కు మద్దతిస్తారు. ఇక్కడ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఎంపీ చామల కిరణ్‌ (కాంగ్రెస్‌), ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌) నమోదు చేసుకున్నారు. దీంతో ఇరు పార్టీల బలం 16కు చేరుతుంది. ఈ నేపథ్యంలో జనగామ టాస్‌ వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

⇒ అలియాబాద్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 11. కాంగ్రెస్‌కు 8, బీఆర్‌ఎస్‌కు 7 కౌన్సిలర్లు గెలిచారు. ఇక్కడ బీఎస్పీతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్‌ క్యాంపులో ఉన్నారు. ముగ్గురు బీజేపీ సభ్యులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లలో ఎవరికీ మద్దతివ్వడం లేదు. చైర్మన్‌ పదవి అడుగుతున్నారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను చీల్చే పనిలో కాంగ్రెస్‌ ఉంది. ఏం జరుగుతుందో సోమవారమే స్పష్టత రానుంది.  

⇒ ఎల్లంపేట: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 13. కాంగ్రెస్‌కు 8 మంది, బీఆర్‌ఎస్‌కు 12 మంది బలం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే మల్లారెడ్డి (బీఆర్‌ఎస్‌) ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ బలం 13కు చేరనుంది. ఈ మేరకు స్పష్టత ఉన్నా, బీఆర్‌ఎస్‌లో చీలిక తెస్తున్నామని కాంగ్రెస్‌ అంటోంది. ఈ నేపథ్యంలో ఎల్లంపేట పీఠం ఎవరికి దక్కుతుందో సోమవారమే తేలనుంది.  

⇒ పరిగి: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌కు 10 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్‌కు 8, బీఆర్‌ఎస్‌కు 8 మంది బలం ఉంది. ఇద్దరు స్వతంత్రులు చెరో పక్షం చేరారు. దీంతో ఇరు పార్టీలకు బలం చేరింది. ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ (కాంగ్రెస్‌) ఎక్స్‌ అఫీషియో నమోదు చేసుకోవడంతో ఆయన ఓటుతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ ఖాతాలో చేరనుంది.  

⇒ మొయినాబాద్‌ : ఈ మున్సిపాలిటీ మ్యాజిక్‌ ఫిగర్‌ 14. ఇందులో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 7 గెల్చుకున్నాయి. ఇక్కడ స్వతంత్రులు ఐదుగురు గెలిచారు. వీరిలో మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైనంత మంది స్వతంత్రులు కాంగ్రెస్‌ గూటికి చేరారు. వీరి సహకారంతో మొయినాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ పరం కానుంది.  

⇒ వికారాబాద్‌: ఈ మున్సిపాలిటీ మ్యాజిక్‌ ఫిగర్‌ 18 కాగా, కాంగ్రెస్‌ నుంచి 17 మంది గెలిచారు. స్వతంత్రుల మద్దతులో ఎక్స్‌ అఫీషియో ఓటు అవసరం లేకుండానే కాంగ్రెస్‌ జెండా ఎగరనుంది.  

⇒ వర్ధన్నపేట: ఈ మున్సిపల్‌ పీఠం కోసం 7గురు సభ్యుల బలం అవసరం. ఇందులో కాంగ్రెస్‌ గెలిచిన ఐదింటితోపాటు మరో స్వతంత్రుడు కలిపితే అధికార పార్టీ పక్షాన ఆరుగురు అయ్యారు. బీఆర్‌ఎస్‌ ఆరుగురు కౌన్సిలర్లను గెలిచింది. దీంతో ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ఓటుతో ఈ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్‌ పరం కానుంది.
 
⇒ కేసముద్రం: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం 9 మంది బలం కావాలి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు 8 చొప్పున స్థానాలు వచ్చాయి. ఇక్కడి నుంచి మహబూబాబాద్‌ లోక్‌సభ సభ్యుడు బలరాం నాయక్‌ ఎక్స్‌ అఫీషియో ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఈయన ఓటుతో కేసముద్రం పురపాలికపై కాంగ్రెస్‌ జెండా ఎగరనుంది.  

⇒ జహీరాబాద్‌: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 19 కాగా, బీఆర్‌ఎస్‌ 15, బీజేపీ 3 కలిసినా మ్యాజిక్‌ ఫిగర్‌ రాదు. 14 మంది కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. వీరికి ఇద్దరు ఎంఐఎం, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతివ్వనుండడంతో పాటు ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా రానుండడంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ పరమయ్యే అవకాశాలున్నాయి.  

⇒ గద్వాల: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 19. కాంగ్రెస్‌కు 16, బీఆర్‌ఎస్‌ 11, బీజేపీ నుంచి 7గురు, ఎంఐఎం నుంచి ఒక్కరు, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. ఎంఐఎం, స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ బలం 19కి చేరుతోంది. అయితే, ఇక్కడ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అవగాహన కుదర్చుకున్నారు. రెండు పార్టీల బలం 18కి చేరుతోంది. కాంగ్రెస్‌ శిబిరంలో ఉన్న ఇద్దరు స్వతంత్రులను తమ వైపునకు తిప్పుకునేందుకు ఏకంగా చైర్మన్‌ పదవిని ఆఫర్‌ చేస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచనతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపీ మల్లురవిలు ఎక్స్‌ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. మరో ట్విస్ట్‌ ఏమిటంటే... ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 11 మందిలో పలువురు సరిత వర్గీయులే. దీంతో గద్వాల రాజకీయం ఆసక్తికరంగా మారింది.  

⇒ నారాయణపేట: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 13. కాంగ్రెస్‌ 7, ఎంఐఎం రెండు కలిపితే 9 మంది అవుతున్నారు. బీజేపీకి 11తోపాటు ఎంపీ అరుణ ఎక్స్‌ అఫీషియో ఓటు, స్వతంత్రుడితో  ఆ పార్టీ బలం 13కి చేరింది. కానీ, ఇక్కడ బీఆర్‌ఎస్‌ (2), ఏఐఎఫ్‌బీ (1)తో పాటు ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి ఎక్స్‌ అఫీషియో ఓటు కాంగ్రెస్‌కు వస్తే ఆ పార్టీ బలం కూడా 13కు చేరనుంది. కానీ, గద్వాలతో ముడిపెట్టిన బీజేపీ.. బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ వైపునకు వెళ్లకుండా కట్టడి చేస్తోంది. కాంగ్రెస్‌ తనవంతు ప్రయత్నాలను విరమించలేదు. అనూహ్యం జరగకపోతే ఈ మున్సిపాలిటీ బీజేపీ పరమయ్యే అవకాశాలే ఎక్కువ.  

⇒ అమరచింత: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ ఆరు కాగా, మూడు ప్రధాన పార్టీలు మూడు చొప్పున గెలుపొందాయి. ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. సీపీఎం కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో ఆ పార్టీ బలం నాలుగుకు చేరింది. కానీ, ఇక్కడ బీఆర్‌ఎస్, బీజేపీలు కలిసి పీఠం పంచుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలుత ఎవరు చైర్మన్‌ కావాలన్న పీఠముడి వీడితే అమరచింత బీజేపీ, బీఆర్‌ఎస్‌ కూటమిదే.  

⇒ జమ్మికుంట: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 16 కాగా, బీఆర్‌ఎస్‌ 12 స్థానాలు గెలిచింది. ముగ్గురు స్వతంత్రులు, ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఓటుతో ఆ చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయతి్నంచింది. కానీ, 10 మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్‌ పక్షానికి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఒకరు చేరడంతో బీఆర్‌ఎస్‌ బలం తగ్గింది. ఆ కౌన్సిలర్‌తోపాటు ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్‌బీ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్‌ బలం 15కు చేరనుంది. మ్యాజిక్‌ ఫిగర్‌కు రెండు పక్షాలకు ఒక ఓటు తగ్గుతుండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది.  

⇒ ఇస్నాపూర్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 14 కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 12 మంది, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి (ఎక్స్‌ అఫీషియో), ఒక ఇండిపెండెంట్‌తో కలిసి మ్యాజిక్‌ ఫిగర్‌ వస్తోంది. కానీ, ఇక్కడ ముగ్గురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. 10 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఉన్నా­రు. ఇక్కడ బీజేపీకి ఒక్క కౌన్సిలర్‌ లేకపోయినా ఎంపీ రఘనందన్‌రావు ఎక్స్‌ అఫీషియో ఓటు నమో­దు చేసుకున్నారు. ఆయన ఏం చే­స్తారన్నది ఆసక్తికరంగా మారింది.  


⇒ మెదక్, నర్సాపూర్‌ : హంగ్‌ ఏర్పడిన ఈ రెండు మున్సిపాలిటీల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అవగాహన కుదుర్చుకుంటున్నారు. మెదక్‌లో కాంగ్రెస్, నర్సాపూర్‌లో బీజేపీకి చైర్మన్‌ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.  
⇒ రాయికల్‌: ఈ మున్సిపాలిటీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 7 కాగా, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి గెలిచిన ఆరుగురికి తోడు స్వతంత్ర అభ్యర్థి జట్టుకట్టి ఈ మున్సిపాలిటీని దక్కించుకునేలా అవగాహన కుదిరింది.  

⇒ దేవరకద్ర: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ ఏడు కాగా, కాంగ్రెస్‌ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు గెలిచారు. అదే పార్టీ రెబెల్‌ ఒకరు పార్టీలోకి వచ్చారు. బీఆర్‌ఎస్‌ నుంచి మరొకరు కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు. దీంతో ఎమ్మెల్యే ఎక్స్‌ అఫీషియో ఓటు అవసరం లేకుండా ఈ మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగరనుంది.  
⇒ ఇంద్రేశం: ఈ మున్సిపాలిటీలో మేజిక్‌ ఫిగర్‌ 10 కాగా, ఎన్నికల్లో గెలిచిన 9 మందితోపాటు స్వతంత్ర కౌన్సిలర్‌ కూడా ఒకరు మద్దతివ్వనుండడంతో అక్కడ గులాబీ జెండా ఎగరనుంది.  

⇒ కోహిర్‌: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 9 కాగా, గెలిచిన 8 మంది కౌన్సిలర్లతోపాటు మరో ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం కౌన్సిలర్‌తో కలిసి కాంగ్రెస్‌ పార్టీ ఈ మున్సిపాలిటీని దక్కించుకోనుంది.  
⇒ జిన్నారం: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 11 కాగా, బీఆర్‌ఎస్‌ (8), బీజేపీ (4) మధ్య బేరసారాలు జరుగుతున్నాయి. బీజేపీకి వైస్‌ చైర్మన్‌ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది.  

⇒ మెట్‌పల్లి: ఇక్కడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కలిసి బీజేపీకి చెక్‌ పెడుతున్నాయి. ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 14కుగాను బీఆర్‌ఎస్‌(6), కాంగ్రెస్‌ (6)తో పాటు నలుగురు స్వతంత్రులు కలిసి పాలకమండలి ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీంతో 10 చోట్ల గెలిచిన బీజేపీ ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది.  

⇒ జగిత్యాల: మ్యాజిక్‌ ఫిగర్‌కు అవసరమైన 26 స్థానాలకు గాను కాంగ్రెస్‌ పార్టీ 23 గెలిచింది. ఇక్కడ స్వతంత్రులుగా పోటీ చేసిన కాంగ్రెస్‌ రెబెల్స్‌ 15 మంది గెలుపొందారు. వీరికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డితో ఆ పార్టీ అగ్రనాయకత్వం చర్చలు ఫలించడంతో జగిత్యాల పీఠంపై కాంగ్రెస్‌ జెండా ఎగరనుంది.  

⇒ వేములవాడ: ఇక్కడ మ్యాజిక్‌ ఫిగర్‌ 15. 13 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లకుతోడు స్వతం­త్రులు, ఒక బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కూడా తోడయ్యారు. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ వశం కానుంది.

ఆమనగల్లులో ఏమవుతుందో?
బీఆర్‌ఎస్‌కు చెక్‌పెట్టే యోచనలో కాంగ్రెస్, బీజేపీ
ఎక్స్‌ అఫీషియో ఓట్లతో  చైర్మన్‌ పీఠం కైవసం చేసుకునేందుకు పావులు

ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సి­పాలిటీలో 15 వార్డులు ఉండగా, వీటిలో అధికార కాంగ్రెస్‌ కేవలం ఒక్క వార్డు మాత్రమే గెలుచుకుంది. ఆరు వార్డుల్లో బీజేపీ గెలుపొందగా, బీఆర్‌ఎస్‌ 8 వార్డులు గెలుచుకుంది. క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ... రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మద్దతు పలికినట్టు విశ్వసనీయంగా తెలిసింది. చైర్మన్‌ పదవిని కాంగ్రెస్‌కు అప్పగించి, వైస్‌ చైర్మన్‌ పదవితో సర్దుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూలు ఎంపీ మల్లురవి ఎక్స్‌ అఫీషియో ఓట్లతో ఈ పీఠాన్ని ఆ రెండు పార్టీలు కైవసం చేసుకోనున్నట్టు చర్చ జరుగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement