సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కష్ట కాలంలో పార్టీతో ఉన్న జీవన్ రెడ్డికి గౌరవం ఇచ్చే విధంగా పార్టీ హైకమాండ్ చొరవ తీసుకోవాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మీడియా ద్వారా తెలియజేస్తున్నా. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారు. కాంగ్రెస్ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీ లోనే ఉన్నాడు. రాజకీయంగా జీవన్ రెడ్డికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్తోనే ఉన్నారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్న జీవన్ రెడ్డికి అవమానం జరగకుండా కాంగ్రెస్ పెద్దలు చొరవ చూపాలి. జీవన్ రెడ్డికి గౌరవం వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారిని కోరుతున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, జీవన్రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఫుడ్ పాయిజన్ అయిందని జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిమ్స్లో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.


