ఇండిపెండెంట్లకు రూ.2 కోట్లు.. ఫార్చునర్‌ కారు ఆఫర్‌ | Who is the Mayor of Karimnagar? | Sakshi
Sakshi News home page

ఇండిపెండెంట్లకు రూ.2 కోట్లు.. ఫార్చునర్‌ కారు ఆఫర్‌

Feb 16 2026 7:30 AM | Updated on Feb 16 2026 7:35 AM

Who is the Mayor of Karimnagar?

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కరీంనగర్‌ బల్దియాలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 66 డివిజన్లలో 30 స్థానాలు గెలుచుకుని మేజిక్‌ ఫిగర్‌ సాధించామని, తమకు నలుగురు స్వతంత్రులు తోడుగా ఉన్నారని, ఎక్స్‌ఆఫీషియో ఓటు కింద ఎంపీ ఉన్నారని మొత్తం 35 సీట్ల బలం ఉందని బీజేపీ భావించినప్పటికీ రాత్రికి రాత్రి పరిస్థితులు తలకిందులయ్యాయి. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌09, మజ్లిస్‌03, ఏఐఎఫ్‌బీ 02, స్వతంత్రులు04, ఎక్స్‌ అఫీషియో 02 (ఇద్దరు ఎమ్మెల్యేలు)తో కలిపి తమకు 34 బలముందని చెప్పిన కాంగ్రెస్‌.. తెల్లవారే సరికి బీజేపీ శిబిరంలో ఉన్న కార్పొరేటర్‌ విప్పల సాయిజ్యోతిని తమవైపు తిప్పుకుని ఆ బలాన్ని 35కు పెంచుకుంది. ఇందుకు సీఎం కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు వరకు పర్యవేక్షించాల్సి వచ్చింది.

రోజంతా హైడ్రామా
15 డివిజన్‌ నుంచి ఏఐఎఫ్‌బీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన విప్పల సాయిజ్యోతి తొలుత బీజేపీలో చేరి ఆదివారం సాయంత్రం నాటికి కాంగ్రెస్‌ గూటికి చేరింది. ఆమె పార్టీ మారడం వెనక సీఎం కార్యాలయంతోపాటు మంత్రులు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు కృషి ఎంతో ఉంది. ఆదివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయిజ్యోతి తాము చెప్పినట్లుగా ఓటేయాలంటూ ఏఐఎఫ్‌బీ నాయకులు ఆమె ఇంటికి విప్‌ నోటీసు అంటించారు. ఆమెతో కాంగ్రెస్‌ నేతలు చర్చలు ప్రారంభించారని తెలిసి బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. బీజేపీలో చేరాక పార్టీ ఎలా మారతారంటూ నినాదాలు చేశారు. భారీ బందోబస్తు మధ్య సాయిజ్యోతిని హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ శిబిరానికి తరలించగా, అక్కడ ఆమె మరో కార్పొరేటర్‌ బొట్ల శ్యామల, ఇండిపెండెంట్‌ కొమురయ్యతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్‌ కూటమి బలం 35కు చేరుకుంది. మేయర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థా లేక ఇండిపెండెంట్‌గా ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతారా? అన్నది ఉత్కంఠగా మారింది.

  • జమ్మికుంటలోనూ హంగ్‌ ఉత్కంఠను రేపింది. మొత్తం 30 సీట్లలో బీఆర్‌ఎస్‌ 12 స్థానాలు గెలవగా.. కాంగ్రెస్‌ 10, బీజేపీ 04, స్వతంత్రులు 3, ఏఐఎఫ్‌బీ 01 సీట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌లో ఒక కౌన్సిలర్‌ వెళ్లి కాంగ్రెస్‌ శిబిరంలో చేరారు. కాంగ్రెస్‌ 10, స్వతంత్రులు 3, ఏఐఎఫ్‌బీ 01, బీఆర్‌ఎస్‌ రెబల్‌1 కలిపి 15 స్థానాలతో మున్సిపాలిటీ వశపరుచుకోవాలని చూసినా మేజిక్‌ ఫిగర్‌ చేరలేదు. దీంతో బలపరీక్ష వాయిదా వేసే యోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు సమాచారం.

  • జగిత్యాల జిల్లా రాయికల్‌లో 12 సీట్లున్నాయి. బీజేపీ 5, బీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్‌ 3, స్వతంత్రులు ఒక సీటు గెలిచారు. కరీంనగర్‌ తరహాలోనే ఇక్కడా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ జట్టు కట్టి బీజేపీ ఆశలకు గండికొట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

  • 26 సీట్లున్న మెట్‌పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు బీజేపీ గెలుచుకోగా.. బీఆర్‌ఎస్‌ 06, కాంగ్రెస్‌ 06, స్వతంత్రులు 04 సీట్లు తెచ్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు పెట్టుకున్నాయి. దీంతో బీజేపీకి మున్సిపాలిటీపై ఆశలు సన్నగిల్లాయి.

  • పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం, సు ల్తానాబాద్, రామగుండం, జగిత్యాల జిల్లా ధర్మపురి, కోరుట్ల, సిరిసిల్ల జిల్లా వేములవాడ, కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో స్పష్టమైన మెజారి టీ రావడంతో కాంగ్రెస్‌ పాలకవర్గాలను ఏర్పా టు చేయనుంది. సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ పార్టీ బల్దియాపై గులాబీ జెండా ఎగరేయనుంది.

ఇండిపెండెంట్ల జోరు
హంగ్‌ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు, కార్పొరేటర్ల పంట పండింది. వీరి మద్దతు కీలకమవడంతో పార్టీలు ఒక్కొక్కరికి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆఫర్‌ చేస్తున్నాయి. కరీంనగర్‌ లాంటి చోట డబ్బుతో పాటు ఫార్చునర్‌ కారు ఇచ్చేందుకు సిద్ధమయ్యారంటే వీరి డిమాండ్‌ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి హంగ్‌ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లతో బేరసారాలు రూ.కోట్లకు చేరాయి.

కరీంనగర్‌ బల్దియాలో నేడు 
ప్రమాణ స్వీకారం: ఉదయం 
11.00 నుంచి 12.30 గంటల వరకు 
మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక: మ.12.30 నుంచి 1.30 వరకు 
ప్రెసిడింగ్‌ అధికారి: ఆర్డీవో 
ఎన్నిక మొత్తం: వెబ్‌కాస్టింగ్, లైవ్‌స్ట్రీమింగ్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement