సాక్షి, సంగారెడ్డి: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. కేసు నమోదు చేసి.. రిపోర్ట్ ఇవ్వాలని ఎస్పీని ఎస్ఈసీ ఆదేశించింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయంపై జగ్గారెడ్డి స్పందిస్తూ.. ఇప్పుడే తానూ మీడియాలో చూశానని సంగారెడ్డిలో జరిగిన గొడవపై ఎన్నికల కమిషన్ స్పందించిందన్నారు.
‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి అప్పుడు సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్కో వార్డులో 300లకు పైగా దొంగ ఓట్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేర్చారు. అప్పుడు నమోదు చేసుకున్న దొంగ ఓట్లు నేడు మున్సిపల్ ఎన్నికల్లో వేస్తున్నారు. దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సీఐ శివ కుమార్ పట్టుకున్నారు.. దీంతో నేను అక్కడికి వెళ్ళాను.. గొడవ జరిగింది’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
మరి ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కారా?. ఈ విషయానికి కూడా ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలి. దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్, అధికారులు విఫలమై.. దొంగ ఓటర్లను అడ్డుకున్న మాపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం కరెక్టా?’’ అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.


