సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్లో తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బాల్క సుమన్ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. అలాగే, కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. వారు తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్పై కేటీఆర్ స్పందిస్తూ..‘క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి దౌర్జన్యంగా దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ కుట్రలో భాగంగానే సుమన్పై అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు దుర్మార్గంగా అరెస్ట్ చేయించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా క్యాతన్పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు.
బాల్క సుమాన్ది పూర్తిగా అక్రమ అరెస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఇది. క్యాతన్పల్లి మున్సిపాలిటీని అడ్డదారుల్లో కైవసం చేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే కాంగ్రెస్ ఈ కుట్రకు తెరలేపింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటికీ వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకుంటే మంచిది. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వారు తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బాల్క సుమన్ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.


