సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది.. అయినా స్పీకర్ ఎందుకు సాగదీస్తున్నారని ప్రశ్నించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు పిటిషన్పై స్పీకర్ విచారణకు ఈరోజు ఏలేటి మహేశ్వర్రెడ్డి హాజరయ్యారు. స్పీకర్ విచారణ అనంతరం మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్లో ఎంపీగా పోటీ చేశారు. బీఆర్ఎస్కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనర్హత నిర్ణయంపై స్పీకర్ ఏడాదిన్నరగా కాలాయాపన చేస్తున్నారు. అనర్హత పిటిషన్లను నీరు గార్చాలని స్పీకర్ చూస్తున్నారు. ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకం ఆడుతున్నాయి.
దానం నాగేందర్ కేసును సుమోటాగా తీసుకోని చర్యలు తీసుకునే అన్ని ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో దానంను బీఆర్ఎస్ సస్పెండ్ చేసినట్లు అఫిడవిట్ ధాఖలు చేసిన విషయం తెలుసా అని అడ్వకెట్స్ అడిగారు. కోర్టులో ఆఫడవిట్ వేసిన బీఆర్ఎస్ ఇన్ని రోజులు ఎందుకు దాచి పెట్టారు?. కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎందుకు సాగదీస్తోంది. దానంను సస్పెండ్ చేస్తే.. ఈ కేసు నిలబడదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


